Hyderabad | నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ వేను మూసివేయాలని నిర్ణయించారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట, మైండ్స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైతలాపూర్, బాలానగర్ ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు వంతెనలను 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేస్తామని వెల్లడించారు.
క్యాబ్, ఆటో డ్రైవర్లకు హెచ్చరిక
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను 94906 17346 నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.