సిటీబ్యూరో/బండ్లగూడ, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గోవా కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా నడుపుతున్న ఒక ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక మహిళతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సోమవారం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగదీశ్వర్రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. నానక్రామ్గూడకు చెందిన లింగంపల్లి అనురాధ(34)కు స్థానిక ప్రగతినగర్కు చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సదరు వ్యక్తి డ్రగ్స్ వినియోగించడంతో.. అతడి ద్వారా అనురాధ సైతం మత్తు పదార్థాలకు అలవాటు పడింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ద్వారా గోవాలో డ్రగ్స్ విక్రయించే జేమ్స్ను పరిచయం చేసుకుంది. తరచూ గోవాకు వెళ్లి అతడి వద్ద నుంచి కొకైన్, ఎండీఎంఏ.. తదితర మాదకద్రవ్యాలను కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఈ విధంగా కొనుగోలు చేసిన మత్తు పదార్థాలను బస్సు మార్గంలో నగరానికి తీసుకువచ్చి.. తనకు పరిచయం ఉన్న వారికి, డ్రగ్స్ అలవాటు ఉన్న స్నేహితులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నది. ఈ క్రమంలో తన స్నేహితుల ద్వారా గచ్చిబౌలి, జేబీ కాలనీలోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నిర్వాహకులు సానికొమ్ము ప్రభాకర్రెడ్డితో పరిచయం ఏర్పడింది.
ప్రభాకర్రెడ్డితో సన్నిహితంగా ఉంటూ అతడికి సైతం మత్తు పదార్థాలు తీసుకోవడం అలవాటు చేసిన అనురాధ.. అంతటితో ఆగకుండా డ్రగ్స్ వ్యాపారం చేస్తే మంచి లాభాలు ఉంటాయని ప్రోత్సహించింది. ఈ క్రమంలో డ్రగ్స్కు అలవాటుపడిన ప్రభాకర్రెడ్డితో కలిసి అనురాధ నగరంలో మత్తు పదార్థాలను విక్రయిస్తున్నది. ఇదిలా ఉండగా.. తరచూ అల్పహారం చేయడానికి వరలక్ష్మి టిఫిన్ సెంటర్కు వచ్చే జూబ్లీహిల్స్కు చెందిన వెంకట శివసాయి కుమార్.. ‘పల్లెటూరు పుల్లట్లు’ పేరుతో స్థానికంగా హోటల్ ప్రారంభించేందుకు సహకరించాలని ప్రభాకర్రెడ్డిని కోరాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ద్వారా వెంకటసాయి కుమార్ సైతం డ్రగ్స్కు బానిసయ్యాడు. తరచూ ప్రభాకర్రెడ్డి నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మోకిల్లా పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు కలిసి ఇందిరారెడ్డినగర్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారివద్ద నుంచి రూ. 14 లక్షల విలువైన 51.45 గ్రాముల కొకైన్, 44 గ్రాముల ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, 8గ్రాముల ఎండీఎంఏ క్రిస్టళ్లతో పాటు మూడు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ జోన్ అడిషనల్ డీసీపీ రేష్మీ పెరుమాల్, ఏసీపీ లక్ష్మీనారాయణ, మోకిల ఇన్స్పెక్టర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.