సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 3 జోన్ల నుంచి 5 జోన్లకు విస్తరించింది. రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎల్బీనగర్ జోన్ రాచకొండలో విలీనమైన విషయం తెలిసిందే. దీంతో అప్పటి వరకు నాలుగు జోన్లుగా ఉన్న సైబరాబాద్లో మూడు జోన్లు (శంషాబాద్, మాదాపూర్, బాలానగర్) సేవలందిస్తున్నాయి. అయితే, రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతోపాటు సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడర్లో ప్రతిష్టాత్మకమైన పలు అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనరేట్లో ప్రజలకు, ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు భద్రతను మరింత పటిష్టం చేయడంతోపాటు నేరాలను నియంత్రించడంలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్లో మరో రెండు కొత్త జోన్లు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్లలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్లకు డీసీపీలను నియమించారు. దీంతో జనవరి మాసం నుంచే కొత్త జోన్లలో కార్యకలాపాలు మొదలైనట్లు అధికారులు తెలిపారు.
కమిషనరేట్ పరిధి వివరాలు:
రెండు కొత్తగా ఏర్పడిన జోన్లతో కలిపి మొత్తం 5 డీసీపీ జోన్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన రెండు డివిజన్లతో కలిపి 11 ఏసీపీ డీవిజన్లు, కొత్తగా ఏర్పడిన 5 పోలీసు స్టేషన్లతో కలి పి మొత్తం 43 ఠాణాలు సైబరాబాద్లో సేవలు అందిస్తున్నాయి.
జోన్ల వారీగా డివిజన్ల వివరాలు:
మొన్నటి వరకు శంషాబాద్ జోన్ పరిధిలో ఉన్న రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు, కొత్తగా ఏర్పడిన నార్సింగి డివిజన్తో కలిపి కొత్తగా రాజేంద్రనగర్ జోన్ను ఏర్పాటు చేశారు. గతంలో శంషాబాద్ జోన్ డీసీపీగా విధులు నిర్వహించిన జగదీశ్వర్రెడ్డికి రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా పోస్టింగ్ కల్పించారు. బాలానగర్ జోన్ పరిధిలోని పేట్బషీరాబాద్ డివిజన్, కొత్తగా ఏర్పడిన మేడ్చల్ డివిజన్తో కలిపి మేడ్చల్ జోన్గా ఏర్పడింది. మొన్నటి వరకు బాలానగర్ డీసీపీగా విధులు నిర్వహించిన సందీప్ను మేడ్చల్ జోన్ డీసీపీగా నియమించారు.