సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, శేరీలింగంపల్లి జోన్ల పరిధిలో నిషేదాజ్ఞలను అమలు చేయనున్నట్లు కుత్బుల్లాపూర్ జోన్ ఇన్చార్జ్ డీసీపీ సాయిమనోహర్, శేరీలింగంపల్లి జోన్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాలైన మేడ్చల్, జీనోమ్ వ్యాలీ(అలియాబాద్, ఎంసీ పల్లి) పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, శేరీలింగంపల్లి జోన్, ఐడీఏ బొల్లారం, పటాన్చెరు ఠాణాల పరిధిలోని గడాపోఠారం మున్సిపాలిటీలోని చెట్లపోత్రం, ఖాజిపల్లి, మధారం, కిైస్టెపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలు, ఇంద్రేశం ఐనోల్,
రామేశ్వరంబండా, బాచుగూడెం, చినకంజెర్ల, పెద్ద కంజెర్ల గ్రామాలు, ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని చిట్కూల్, ఇస్నాపూర్, రుద్రారం, లక్డారం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల చుట్టూ 200మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163సెక్షన్ అమలులో ఉంటుందని, దీని ప్రకారం నిషేదాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతాల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గుమిగూడటం, సభలు, సమావేశాలు, రాస్తారోకోలు, ధర్నాలు వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.