సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఎన్నికల బందోబస్తు, ఏర్పాట్లపై గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు అమోయ్కుమార్, హరీశ్, రాచకొండ సీపీ డీఎస్.చౌహాన్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, బందోబస్తుపై జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లతో చర్చించారు. అనంతరం సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ సైబరాబాద్, రాచకొండ పరిధిలోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత జోనల్ డీసీపీలను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్రూమ్స్లను గుర్తించి అక్కడ కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు పరస్పరం సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ మాట్లాడుతూ ఎన్నికల నియమ, నిబంధనలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందిపై ఉందన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలను పారదర్శకంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పరస్పర సహకారంతో ఎన్నికలు సజావుగా జరిగేలా కృషిచేయాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన డీసీపీలు, ఏసీపీలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.