సిటీబ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన గురువారం పట్టణ ప్రణాళిక విభాగంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, బిల్డ్ నౌ ద్వారా అందుతున్న నిర్మాణ రంగ అనుమతులు, టీడీఆర్ దరఖాస్తులు, పెండింగ్ కోర్టు కేసులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, రహదారుల విస్తరణకు సంబంధించిన భూ సేకరణ అంశాల పురోగతిని సీసీపీ వెంకన్న నుంచి అడిగి తెలుసుకున్నారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్సూన్ సన్నద్ధతపై పై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, సెల్లార్ తవ్వకాలు, అనధికారిక హోర్డింగ్లను గుర్తించి.. తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.