సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భద్రతా పరంగా సర్వం సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోకి నాలుగు జిల్లాలు వస్తాయని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 13 నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 34,42,219 మంది ఓటర్లు ఉండగా, 3202 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. ఇందులో 655 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ కేంద్రాల వద్ద పారా మిలటరీ ఫోర్స్ను మోహరించామన్నారు. 103 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 40 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏవైనా ఘటనలు జరిగితే పట్టణ ప్రాంతాల్లో 5 నిమిషాల్లోనే స్పందించే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో 8 నిమిషాల్లో స్పందించే విధంగా సాంకేతికపరమైన ఏర్పాట్లు చేశామన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 6,400 మంది పోలీసులను మోహరించామన్నారు. అందులో 5,200 మంది సివిల్ పోలీసులు కాగా, 1,200మంది ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్తో పాటు మూడు కంపెనీల స్పెషల్ పార్టీ (టీఎస్ఎస్పీ), 18 కంపెనీల సెంట్రల్ పారామిలటరీ ఫోర్స్తో ఎన్నికల విధులు నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో మొత్తం 23 అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. అక్కడ అక్రమంగా తరలించే మద్యం, డబ్బులు, బంగారం, ఇతర వస్తువులపై నిఘా ఉంటుందన్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి బుధవారం సాయంత్రం వరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం రూ. 169.3కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసినట్లు సీపీ వివరించారు. అందులో రూ.99.53 కోట్ల విలువైన బంగారం, రూ.62.60కోట్ల నగదు, రూ.1.29కోట్ల విలువైన 2,6954 లీటర్ల మద్యం, 3.26కోట్ల విలువైన 1,270 కిలోల గంజాయి, రూ.2.57కోట్ల ఉచిత పంపిణీలను సీజ్ చేసినట్లు వివరించారు.
కమిషనరేట్ పరిధిలో మొత్తం 6 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 6 రిసెప్షన్ సెంటర్లు, 2 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారని, ఈ కేంద్రాల వద్ద ఆర్ముడ్ ఫోర్స్తో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు పూర్తిస్థాయి భద్రత కల్పించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర ప్రత్యేక బలగాలు, సివిల్ పోలీసులతో కలిసి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు.
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పారా మిలటరీ బలగాలతో మొదటి అంచె భద్రత, ఆర్ముడ్ ఫోర్స్తో రెండో అంచె భద్రత, స్ట్రాంగ్ రూమ్ల బయట సివిల్ పోలీసులతో మూడో అంచె భద్రతను ఏర్పాటు చేశామని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. పూర్తి భద్రత మధ్య ఈవీఎంలు, వీవీపాట్స్, తదితర ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొట్ట మొదటిసారిగా పీఎస్ఐఐసీ సెంటర్ ద్వారా జియోగ్రఫి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను వినియోగిస్తున్నామన్నారు. బందోబస్తులో భాగంగా మోహరించిన పోలీసు, భద్రతా బలగాలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేశామన్నారు. అన్ని పోలీసు వాహనాలకు జీపీఆర్ సిస్టమ్ను ఏర్పాటు చేశామన్నారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్ల లొకేషన్లను జియోట్యాగ్ చేశామని, సున్నిత పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను అమర్చామన్నారు. అంతేకాకుండా.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సైబరాబాద్ వాట్సాప్ కంట్రోల్, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ఎవరైనా మభ్యపెట్టే ప్రయత్నం చేసినా, బెదిరింపులకు పాల్పడినా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.