cyber fraud with using amazon and flipkart work from home | అమెజాన్.. ప్లిప్కార్డులతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాం.. ఆ సంస్థల బిజినెస్ ప్రమోషన్ కోసం మా సంస్థలు పనిచేస్తున్నాయి.. మా సంస్థ తరఫున మీకు ఉద్యోగం ఇస్తాం.. ఇంట్లో ఉండి రోజుకు రూ.2 వేల నుంచి రూ.8 వేలు సంపాదించవచ్చంటూ నమ్మిస్తూ ప్రతి రోజు వందలాది మందిని సైబర్ నేరగాళ్లు కోట్లలో చీట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు మాట్లాడే ప్రతి మాట నమ్మకంగా ఉండటంతో అనేక మంది బుట్టలో పడిపోతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. మీరు తక్కువ పెట్టుబడితో టార్గెట్లు పూర్తి చేయాలంటూ యూపీఏ లింక్లు పంపి డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. రెండు నుంచి ఐదు వందలు పెట్టుబడి పెట్టించి వాటికి రెట్టింపు పేమెంట్లు అందజేస్తున్నారు. చిన్న మొత్తంతో ఎర వేసి వలలోకి లాగేస్తూ లక్షల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ముందు లాభాలతో మురిపించి.. చివరకు లక్షల్లో కొల్లగొట్టేసి ఏడిపిస్తున్నారు.
కవాడిగూడకు చెందిన ఓ గృహిణిని అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోం అంటూ నమ్మించారు. ఆమె సెల్ఫోన్కు వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను క్లిక్ చేయడంతో అందులో చాట్ చేసిన ఓ వ్యక్తి టెలిగ్రామ్ గ్రూప్లోకి ఆహ్వానించాడు. అందులో మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి చూడండి.. మీకు లాభాలు వస్తున్నాయని నమ్మకం వచ్చిన తరువాత ఎక్కువ పెట్టండంటూ సూచించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె రూ. 200 పెట్టుబడి పెట్టింది. తరువాత ఐదు వం దలు పెట్టుబడి పెట్టడంతో ఆమెకు రెండింటిలో లాభం వచ్చింది. తరువాత ఆమె పెట్టుబడి పెంచుతూ వెళ్లింది. అయితే పెడుతున్న పెట్టుబడికి భారీ లాభాలొస్తున్నాయని తన యాప్లో స్క్రీన్పై కన్పిస్తున్నాయి. డ్రా చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. గ్రూప్లో చాట్ చేస్తే మీకు డబ్బులు అన్ని ఒకేసారి వస్తాయి, మీ టార్గెట్లు పూర్తవుతూ ఉంటే లాభాలు భారీగా పెరుగుతుంటాయంటూ నమ్మిస్తూ రూ.3.9 లక్షలు ఆమెతో పెట్టుబడి పెట్టించారు. స్క్రీన్పై రూ.8.5 లక్షల లాభం కనిపించడంతో ఆమె కూడా పెట్టుబడి పెడుతూ వెళ్లింది. చివరకు అదంతా మోసమని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.
నమ్మకం కుదిరేందుకు వివిధ సర్టిఫికెట్లు తమకు ఉన్నాయని, ఆయా సంస్థలతో ఒప్పందాలున్నాయంటూ అబద్దాలు చెబుతూ అమాయకులను నమ్మిస్తున్నారు. ఈ యాప్లలో పెట్టుబడులను యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్పేస్) పద్ధతిలో తీసుకుంటున్నారు. నేరుగా బ్యాంకు ఖాతాలోకి రాకపోవడంతో, యూపీఐ చిరునామ, ఖాతా వివరాలు సంబంధిత సంస్థల నుంచి రప్పించేందుకు 15 రోజులకుపైగానే పడుతున్నది. ఒక యూపీఐ పూర్తి వివరాలు వచ్చే వరకు, సైబర్నేరగాళ్లు మరో యూపీఐ ఖాతాను వాడుతున్నారు. గతంలో ఎక్కువగా చైనీయులు వెనుకుండి ఇన్విస్ట్మెంట్ యాప్లను నడిపించారు. తాజాగా ఢిల్లీలో పలువురు ఇదే తరహా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈజీగా మోసం చేసేందుకు అవకాశముండటంతో ఇప్పుడు ఢిల్లీ, గుర్గావ్కు చెందిన పలువురు ఈ దందాలోకి ఎంట్రీ అయ్యారు.
ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలు చేస్తున్నారు. ఉద్యోగం ఇస్తామని మెసేజ్ పెట్టి పెట్టుబడిలోకి లాగేస్తారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి, టార్గెట్లు అంటూ చెప్పారంటే మోసమని గుర్తించండి. మీ చేత్తో డబ్బులు పెట్టిస్తున్నారంటే అది మోసమే. బ్యాంకు ఖాతా వాడకుండా యూపీఐ లింకులతో డబ్బులు డిపాజిట్ చేయిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకునేలోపే మరో కొత్త యూపీఐతో మోసాలు ప్రారంభిస్తున్నారు. చైనీయుల నుంచి నేర్చుకున్న ఈ మోసాలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా చాలా మంది చేస్తున్నారు.
– కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సైబర్క్రైమ్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆరితేరిన సైబర్ మోసగాళ్లు.. ఇలా కూడా మోసాలు చేసేస్తున్నారు
అత్త చీర కొంటే.. కోడలు ఖాతా ఖాళీ
పెండ్లి చేసుకుందాం.. అమెరికా పోదామంటూ సాఫ్ట్వేర్ యువతికి మస్కా.. 21 లక్షలు నొక్కేసిన కేటుగాడు
నా ఇన్కం రోజుకు 20 వేలు!.. మమ్మల్ని పట్టుకోగలరా?.. పోలీసులకు ఓ సైబర్ నేరగాడి సవాల్
Cyber fraud helpline number|24 గంటల్లోపు ఈ నంబర్కు కాల్ చేస్తే పోయిన డబ్బులు వచ్చేస్తాయి