సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): వాట్సాప్లో పరిచయం అయిన ఓ మహిళ తాను ఒంటరి మహిళనని, వ్యాపారం చేసుకుంటూ అదనంగా ట్రేడింగ్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నానంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 18.36 లక్షలు టోకరా వేసింది. సైనిక్పురికి చెందిన బాధితుడికి మాలతిరెడ్డి పేరుతో ఓ మహిళ వాట్సాప్ ద్వారా పరిచయం అయ్యింది. తాను విడాకులు తీసుకున్నానని, తన తండ్రి టెక్స్టైల్ వ్యాపారాన్ని చూసుకుంటున్నానంటూ మాటలు కలిపింది.
కొన్నాళ్లు ఇద్దరు వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు. ఇంతలో తాను ఒక పక్క వ్యాపారం చేస్తూ మరో పక్క ట్రేడింగ్ చేస్తున్నానని, దీని ద్వారా మంచి ఆదాయం వస్తుందంటూ నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన బాధితుడు ఆమె సూచించిన అప్లికేషన్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. మొదట రూ. 45 వేలు పెట్టుబడి పెట్టడంతో ఒకే రోజులో రూ. 4 వేల లాభం వచ్చింది.
ఆ తరువాత నెమ్మదిగా పెట్టుబడి పెంచుతూ వెళ్లాడు. స్క్రీన్పై అధిక లాభాలు కన్పిస్తున్నాయి, వాటిని ఇప్పుడే విత్ డ్రా చేయవద్దని, అకౌంట్లో ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ షేర్స్ కొనచ్చంటూ నమ్మించింది. తీరా రూ. 18.36 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన తరువాత కూడా స్క్రీన్పై కన్పిస్తున్న అమౌంట్ను డ్రా చేయనివ్వకుండా, డ్రా చేయాలంటే 30 శాతం ట్యాక్స్ చెల్లించాలంటూ షరతు విధించింది. ట్యాక్స్ తాను చెల్లించనని, తన డబ్బు తనకు ఇవ్వాలంటూ గట్టిగా అడిగితే బాధితుడి నెంబర్ను బ్లాక్లో పెట్టేశారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.