బంజారాహిల్స్,ఫిబ్రవరి 14: పాస్పోర్టు డెలివరీ(Passport delivery) మెసేజ్ పేరుతో ఓ వ్యక్తికి కాల్ చేసి బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్ల(Cyber fraud)పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న అనంతపల్లి పురుకాంత్ అనే వ్యక్తి మూడునెలల క్రితం పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాగా పదిరోజుల క్రితం అతడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాము ఇండియా పోస్ట్ నుంచి కాల్ చేస్తున్నామని, మీ పాస్ పోర్ట్ డెలివరీకి సిద్దంగా ఉన్నదని చెప్పారు.
అయితే తాను ఇంట్లో లేనని చెప్పగా తాము పంపించే లింక్కు రూ.2 రూపాయలు పంపిస్తే పాస్పోర్ట్ ఇంటికి పంపిస్తామని నమ్మబలికారు. దీంతో వారు పంపించిన లింక్ను ఓపెన్ చేసి రూ.2 పంపించాడు. కాగా మరుసటిరోజు పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పాస్పోర్ట్ తీసుకున్న వెంటనే అతడి యూనియన్ బ్యాంక్ అకౌంట్నుంచి రూ.99వేలు డ్రా అయినట్లు మెసేజీలు వచ్చాయి.
దీంతో ఆందోళనకు గురయిన బాధితుడు యూనియన్ బ్యాంకుకు వెళ్లి వాకబు చేయగా అతడి అకౌంట్ హ్యాక్ అయిందని తేలింది. దీంతో సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడంతో పాటు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.