‘సాధారణ నేరాలు తగ్గాయి.. సైబర్ నేరాలు పెరిగాయి. హెచ్న్యూతో హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. సొత్తు కోసం హత్యలు, డెకాయిటీ, సూడో పోలిసింగ్ కేసులను వంద శాతం ఛేదించాం. నేరాలు కట్టడి చేసి శాంతి భద్రతలను సంరక్షించే విషయంలో అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ఏడాది విజయవంతంగా రాణించారు’.. అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నేరస్తులు ఏ మూలన దాక్కున్నా.. పట్టుకొస్తున్నామని, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. 2021 (21998)తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు అంతే మొత్తంలో కేసులు (22060) నమోదైనట్లు చెప్పారు. ఆటోమొబైల్ దొంగతనాలు గతేడాది(996)తో పోలిస్తే ఈ సంవత్సరం 1331కి పెరిగాయన్నారు. మొత్తంగా సాధారణ నేరాల్లో 62, ప్రధాన నేరాల్లో 78 శాతం రికవరీలు సాధించినట్లు వెల్లడించారు. బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం వార్షిక నివేదిక(2022)ను సీపీ విడుదల చేశారు. అదనపు సీపీలు విక్రమ్సింగ్ మన్నన్, ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీలు కార్తీకేయ, గజారావు భూపాల్, డీసీపీలు జోయల్ డేవిస్, ప్రకాశ్రెడ్డి, చందనాదీప్తి, సునీల్దత్, రాజేశ్ చంద్ర, సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ)
సైబర్నేరాల్లోనూ గతంలో ఓటీపీ, మ్యాట్రీమోనీ వంటి నేరాలు జరిగేవి, ప్రస్తుతం నేరాలు చేసేందుకు యాప్లు తయారు చేయడం, క్రిప్టో కరెన్సీ, డార్క్ వెబ్ల ద్వారా సైబర్నేరాలు పెరుగుతున్నాయని సీపీ వెల్లడించారు. వీటి దర్యాప్తు కోసం ప్రత్యేక టూల్స్ను సమకూర్చుకొని, సిబ్బందికి దర్యాప్తులో నైపుణ్యం కల్పిస్తూ సంచలనాత్మకమైన కేసులను ఈ ఏడాది ఛేదించామన్నారు. మహేశ్ బ్యాంక్, ఎక్స్సిలికా హ్యాకింగ్, పెట్టుబడుల పేరుతో చైనా సైబర్నేరగాళ్లు రూ. 903 కోట్ల దోపిడీకి సంబంధించిన కీలక కేసులను ఛేదించి.. నిందితులను పట్టుకున్నామని సీపీ చెప్పారు. సోషల్మీడియాలో ఇష్టానుసారంగా వచ్చే పోస్టులపై ‘స్మాష్’తో నిఘా పెట్టాం.. 70 మందిపై చర్యలు తీసుకున్నాం. దీంతో సోషల్మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు తగ్గినట్లు వివరించారు. ఈ ఏడాది 2249 సైబర్ నేరాలు నమోద్వగా, 226 కేసులను ఛేదించామని, 949 ఆర్థికపరమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో 1601 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
హెచ్న్యూ(హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్)ను ప్రారంభించి.. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నామన్నారు. గోవాలో డ్రగ్స్ విక్రయంలో ఎండ్ల తరబడి వ్యాపారం చేస్తున్న ఎడ్విన్, బొర్కర్, డిసోజ, మురుగన్ వంటి కీలకమైన డ్రగ్స్ డాన్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
గతేడాది రోడ్డు ప్రమాదాల మరణాలు 290, ఈ ఏడాది 296 నమోదైనట్లు చెప్పారు. పాదచారులు గతేడాది 93, ఈ సంవత్సరం 109 మంది చనిపోయారన్నారు. గతేడాదితో పోలిస్తే కాంటాక్టులో లక్ష, నాన్ కాంటాక్టు విధానంలో సుమారు రెండు లక్షల వరకు చలాన్లు ఈ ఏడాది తగ్గాయన్నారు. రోప్తో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ సమస్యకు రెండుమూడు రోజుల్లోపరిష్కారం చూపుతామన్నారు.
వివిధ కేసుల్లో జీవిత ఖైదు(15), 20 ఏండ్ల కారాగారం(5), 15 ఏండ్లకారాగారం(1), 10 ఏండ్ల కారాగారం (7), మూడేండ్లకుపై 60 మంది నేరస్తులకు జైలు శిక్షలు పడ్డాయన్నారు. 5327 కేసులు పరిష్కరించారని, 3705 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు.
ప్రతి పోలీస్స్టేషన్, ఏసీపీ, డీసీపీ కార్యాలయాల్లో ఆయా అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటారని, ఆ సమయంలో ఫిర్యాదుదారులు తమ సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. అక్కడ పరిష్కారం కాకుంటే ఫిర్యాదుదారులు కమిషనరేట్కు రావచ్చన్నారు. రోజూ 40 నుంచి 50 మంది విజిటర్స్ తన వద్దకు వస్తుంటారని, అందులో 15 నుంచి 20 మంది ఫిర్యాదులు ఇచ్చేవారు ఉంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తనకు1070 ఫిర్యాదులు రాగా, వాటిని సెంట్రల్ కైంప్లెంట్ సెల్ ద్వారా ఆయా విభాగాలకు పంపించి, ఫిర్యాదుదారులకు దర్యాప్తునకు సంబంధించిన సమాచారం ఇచ్చామన్నారు.
పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఫిట్ కాప్ యాప్ను అందుబాటులోకి తెచ్చామని సీపీ పేర్కొన్నారు.