QR Code | సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ): యూపీఐ పేమెంట్స్లో ఇతరులు పేమెంట్ చేయగానే ఆ డబ్బు ఖాతాలో జమ అవుతుంది.. కానీ సైబర్ నేరగాళ్లు డబ్బు పంపిస్తున్నామంటూ నమ్మిస్తూ క్యూఆర్ కోడ్లతో దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ అవతలి వ్యక్తులు క్యూఆర్ కోడ్ పంపించగానే దానిని స్కాన్ చేస్తే ప్రొసీడ్ టూ పే అనే అప్షన్ ఉంటుంది. దానిని ఒకే చేయగానే మన ఖాతాలో నుంచి డబ్బులు అవతలి ఖాతాలోకి వెళ్తాయి. సంవత్సరం కిందటి వరకు ఇలాంటి మోసాలు ఎక్కువగా జరిగాయి.. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకురావడంతో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.
ఓఎల్ఎక్స్లో ప్రకటనలు వేసే వారికి ఎక్కువగా ఇలాంటి మోసాలు ఎదురయ్యేవి. ఓఎల్ఎక్స్లో జరిగే మోసాలు.. క్యూఆర్ కోడ్తో నేరగాళ్లు ఎలా డబ్బులు లాగేస్తున్నారనే విషయంపై విస్తృతంగా అవగాహన కల్పించడంతో ఇలాంటి మోసాలు తగ్గాయి. అయితే ఇటీవల తిరిగి క్యూఆర్ కోడ్తో జరిగే మోసాలు నమోదవుతున్నాయి. ఇటీవల ఓ యువతి స్టడీ టేబుల్ విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసిన సైబర్నేరగాళ్లు తాము కొంటామంటూ ముందుకువచ్చారు. రూ.10 వేల విలువైన టేబుల్ను విక్రయించేందుకు ప్రయత్నించిన ఆమె, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. వాళ్లు చెప్పినట్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు పంపించాలంటూ సూచనలు చేస్తూ వచ్చారు. మీరు పంపించేదానికి మేం డబుల్ పంపిస్తామంటూ నమ్మించి రూ.14 లక్షలు కాజేశారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే క్యూఆర్ కోడ్ల చెల్లింపులు నమ్మవద్దంటూ సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఆర్మీలో పనిచేస్తున్నామని, మేం పంపించే డబ్బు డబుల్ వస్తుందంటూ నమ్మించేందుకు ప్రయత్నించే వారు చాలా మంది ఉంటారు. ఎందుకు మనకు డబ్బులు రెట్టింపు ఇవ్వడానికి ముందుకు వస్తారు, వాళ్ల వద్ద ఏమైనా డబ్బు ఎక్కువగా ఉందా? అని ఆలోచించాలి. ఓఎల్ఎక్స్లో వస్తువు విక్రయించే వాళ్లకు, కొనేవాళ్లు నేరుగా డబ్బులు ఖాతాలో జమ చేయాలి. అలా కాకుండా క్యూఆర్ కోడ్లు పంపించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.