హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు వాటి పట్ల అవగాహనే సరైన అస్త్రమని మహిళా భద్రతా విభా గం ఇన్చార్జి, అడిషనల్ డీజీ స్వాతి లక్రా అన్నారు. సైబర్ నేరాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ చైతన్యం తెచ్చేందుకే రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ అంబాసిడర్లను తయారు చేశామని తెలిపారు. రాష్ట్రంలో సైబర్ ఆధారిత నేరాల నియంత్రణకు పోలీస్ శాఖతో పాటు స్కూల్ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. బషీర్బాగ్లోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన సైబ్-హర్, సైబర్ కాంగ్రెస్ శిక్షణ ముగింపు స మావేశంలో స్వాతి లక్రా మాట్లాడారు.
33 జిల్లాల్లోని 1,650 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,300 మంది విద్యార్థులకు పది నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. ఈ సైబర్ అంబాసిడర్లు తమ గ్రామాల్లో, పట్టణాల్లో సైబర్ నేరాలకు గురి కాకుండా తమ పెద్దవారిని చైతన్య పర్చాలని సూచించారు. సైబర్ అంబాసిడర్ల శిక్షణపై పొరుగు రాష్ట్ర పోలీస్ విభాగాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. సమావేశంలో పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన, డీఐజీ సుమతి, ఎస్పీ రఘువీర్, పాఠశాల విద్యాశాఖ ఏడీ రమేశ్, సైబర్ నిపుణులు రక్షిత టాండన్, అరుణ్, షెల్జా, సాయి సందేశ్, ప్రసాద్ పాల్గొన్నారు.