ఖైరతాబాద్, సెప్టెంబర్ 11 : పెరుగు విషయంలో హోటల్ సిబ్బందితో జరిగిన పెనుగులాట.. ఘర్షణకు దారి తీసింది. హోటల్ సిబ్బంది దాడిలో ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ దుర్గారావు కథనం ప్రకారం.. చాంద్రాయగుట్టకు చెందిన లియాఖత్ (32) వ్యాపారి. ఆదివారం అర్ధరాత్రి బిర్యాని తినేందుకు తన ఏడుగురు స్నేహితులతో కలిసి పంజాగుట్ట చౌరస్తాలోని మెరీడియన్ హోటల్కు వచ్చాడు. బిర్యానీ ఆర్డర్ చేయగా.. సిబ్బంది తెచ్చి ఇచ్చారు. భోజనం చివరలో అదనంగా పెరుగు కావాలని లియాఖత్ హోటల్ సిబ్బందిని అడిగాడు. సరేనని ఆర్డర్ తీసుకున్న సిబ్బంది చాలా సేటికి వరకు పెరుగు తీసుకురాలేదు. లియాఖత్, అతడి స్నేహితులు చాలా సార్లు పెరుగు తేవాలని అడిగారు. సిబ్బంది తీసుకురాలేదు. లియాకత్ కోపంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. హోటల్ సిబ్బంది, లియాఖత్ స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగింది. అక్కడికి చేరకున్న మరికొంత మంది హోటల్ సిబ్బంది లియాఖత్తో ఘర్షణ పడి, విచక్షణా రహితంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు వచ్చి.. లియాఖత్తోపాటు అతడి స్నేహితులను, హోటల్ సిబ్బందిని స్టేషన్కు తరలించారు. స్టేషన్లో కూర్చొన్న లియాఖత్ తనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నదని చెప్పడంతో పోలీసుల సహాయంతో స్నేహితులు సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో పోలీసులు దాడికిపాల్పడిన మేనేజర్ సయ్యద్ అఫ్తాబ్ హైదర్, సూపర్వైజర్స్ మహ్మద్ అజీజుద్దీన్, జీజ్, వెయిటర్స్ మేగావత్ పాండు, కృష్ణ, సూర్యప్రకాశ్, మొయిన్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి స్నేహితుడు సలీం ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల గుర్తింపు
మెరీడియన్ హోటల్లో జరిగిన దాడి ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. లియాఖత్ మృతి చెందిన వెంటనే ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగానే నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 302 రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
మెహిదీపట్నం: కస్టమర్ లియాఖత్పై దాడిచేసి, హత్య చేసిన పంజాగుట్ట మెరీడియన్ హోటల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ ఖాద్రీ పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ను కోరారు. ఈ మేరకు డీసీపీని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్
మెరీడియన్ హోటల్ ఘటనలో ఇద్దరు పోలీసులపై వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించిన ఎస్సై శివశంకర్తో పాటు కానిస్టేబుల్ రమేశ్ను సస్పెండ్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.