అయిజ, ఏప్రిల్ 23 : కరోనా మహమ్మారి కట్టడికి సర్కార్ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. గతేడాది నుంచి కరోనా కోరలు చాచడంతో ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నది. అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని 28 గ్రామపంచాయతీల్లో అనుమానితులను గుర్తించి డాక్టర్లు కొవిడ్ టెస్టులు చేశారు. పాజిటివ్ వచ్చిన రోగులను హోంక్వారంటైన్లో ఉంచి ఉచితంగా మందులు అందజేశారు. నెల రోజులుగా కొవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పారిశుధ్య కార్మికులు, వ్యాధిగ్రస్తులు 45 ఏండ్లు పైబడిన 6,258 మందికి అయిజ పీహెచ్సీలో వ్యాక్సిన్ వేశారు. 22,530 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 981 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రామలింగారెడ్డి తెలిపారు. 981 మందిలో వివిధ రకాల అనారోగ్యకారణాలతో 12మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.
అలంపూర్లో..
అలంపూర్, ఏప్రిల్ 23 : కొవిడ్ సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తమయ్యారు. 45ఏండ్ల వయస్సు పైబడిన వారు దవాఖానకు వెళ్లి కొవిడ్ వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులు పరీక్షలు చేయించుకుని వారి అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారు ప్రభుత్వం పంపిణీ చేసే మందులకు తీసుకుంటున్నారు. ఎవరికి వారు హోం క్వారైంటైన్ ఉంటూ నిబంధనలు పాటిస్తున్నారు. శుక్రవారం అలంపూర్, క్యాతూరు దవాఖానలో ఆరోగ్య సిబ్బంది మొత్తం 140 మంది టీకాలు వేసినట్లు వైద్యులు రామచంద్రారెడ్డి, శశికిరణ్, మండల ఆరోగ్య విస్తరణ అధికారి లక్ష్మీకాంత్ తెలిపారు.
ఇటిక్యాలలో..
ఇటిక్యాల, ఏప్రిల్ 23 : స్వీయరక్షణ, పరిశుభ్రత పాటించడం వలన కరోనా మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవచ్చునని మండల వైద్యాధికారి ఇందిర సూచించారు. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలన్నారు. అలాగే ఎంతో అవసరం ఉంటే తప్పా బయటకు వెళొద్దని సూచించారు. పీహెచ్సీలోలో ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని మెడికల్ కిట్ అందజేస్తూ వైద్యసిబ్బంది నిరంతరం వారికి సూచనలు చేస్తున్నారన్నారు. పరీక్షల్లో నెగిటీవ్ వచ్చి 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ను వేస్తున్నామన్నారు. శుక్రవారం 85 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11మందికి పాజిటివ్ వచ్చిందని అలాగే పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికి టీకాలు వేశామన్నారు.