మేడ్చల్, జనవరి 5(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, వాటిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ప్రజా పరిపాలన కార్యక్రమాల్లో జిల్లా అధికార యంత్రాంగమంతా నిమగ్నమై ఉన్నది. దీంతో ప్రజా పాలన కార్యక్రమం పూర్తయిన తర్వాత.. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించనున్నట్టు రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు.. ఇందుకు సంబంధించిన ప్రత్యేక నివేదికను కూడా సిద్ధం చేసి ఉంచారు. ఆ నివేదిక, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకునేలా ప్రణాళికను రూపొందించారు.
జిల్లాలో 5,195 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గతంలో రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. గుర్తించిన ప్రభుత్వ భూముల్లో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది.. ఎంత భూమి సంరక్షణలో ఉన్నదన్న విషయాన్ని అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. జిల్లాలోని శామీర్పేట, మేడ్చల్, కీసర, ఘట్కేసర్, మూడుచింతలపల్లి, బాచుపల్లి, మల్కాజిగిరి, అల్వాల్, కూకట్పల్లి, మేడిపల్లి, దుండిగల్, కుత్బుల్లాపూర్, కాప్రా, ఉప్పల్, బాలానగర్ మండలాల్లో 5,195 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో ఎంత వరకు కబ్జాకు గురైందన్న వివరాలు త్వరలోనే తేలనున్నది. అయితే, ఇటీవలే నిరుపేదలు నిర్మించుకున్న నిర్మాణాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూల్చివేసిన విషయం విదితమే. కాగా, కొంత మంది బడాబాబులు కబ్జా చేసిన భూములపై ప్రజల నుంచి పలు ఆరోపణలు వస్తున్నాయి. గుర్తించిన ప్రభుత్వ భూముల్లో త్వరలోనే బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.