ఎప్పుడెప్పుడా అని బుకీలు, పందెం రాయుళ్లు, యువత ఎదురు చూస్తున్న టీ-20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. బంతి బంతికీ రూ.కోట్లల్లో చేతులు మారుతున్నాయి. ఆన్లైన్ వేదికగా దందా జోరుగా సాగుతున్నది. అయితే వీటికి నగర యువత దూరంగా ఉండాలని, వాటి ఉచ్చులో పడి కుటుంబాలను రోడ్డున పడేయవద్దని పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్భగవత్, స్టీఫెన్ రవీంద్ర హెచ్చరిస్తున్నారు. యువత బెట్టింగ్ల జోలికి పోకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లల ఫోన్లను నిత్యం పరిశీలిస్తూ బెట్టింగ్, గేమింగ్ యాప్లు ఉండకుండా చూడాలని చెబుతున్నారు.
డబ్బుల వ్యవహారంపై తల్లిదండ్రులు నజర్ పెంచాలని, ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లు అనుమానం వస్తే.. వెంటనే 100కు సమాచారం అందించాలని కోరారు. అయితే, ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలో బెట్టింగ్లపై నిఘా పెరగడంతో బుకీల అడ్డా గోవాకు మారినట్లు సమాచారం. అయినప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఆందోళన కలిగిస్తున్నాయి. వాటి పట్ల జాగ్రత్త అవసరం. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ పనిచేయకుండా చూడాలని గూగుల్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసినప్పటికీ స్పందించక పోవడం శోచనీయం. కాగా, దాయాదుల మ్యాచ్ పై భారీ బెట్టింగ్కు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిఘా పెంచినట్లు విశ్వసనీయ సమాచారం.
సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): బెట్టింగ్లపై ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసుల నిఘా పెరగడంతో క్రికెట్ బుకీల అడ్డా ఇప్పుడు గోవాకు మారింది. ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఇటీవల ఐపీఎల్ సమయంలో పంజా విసరడంతో బెట్టింగ్లు నిర్వహించే బుకీలు టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లపై బెట్టింగ్లను నిర్వహించే వేదికను గోవాతో పాటు ఇతర ఉత్తరాధి రాష్ర్టాలకు మార్చారు. అక్కడి నుంచి ఆన్లైన్లో బెట్టింగ్లను నిర్వహించేందుకు వారు సిద్ధమయ్యారు.
దీంతో పోలీసులు ఇప్పుడు వారి ఏజెంట్లు, అనుచరుల కదలికలపై నిఘా పెట్టారు. సాంకేతికంగా కూడా వారిని ఫాలో అవుతున్నారు. ఐపీఎల్ సందర్భంగా అరెస్ట్ అయిన బుకీలు, పందెం రాయుళ్ల సమాచారాన్ని పోలీసులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. పోలీసుల నిఘాను పసిగట్టిన బుకీలు, ఇతర బెట్టింగ్ నిర్వాహకులు తమ కదలికలను పసిగట్టకుండా అడ్డాలు మార్చేస్తున్నారు. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై ఫుల్ క్రేజ్ ఉంది.
పందెంరాయుళ్లు, వ్యాపారులు, బ్లాక్ దందా చేసే వ్యాపారులు ఇలా అనేక వర్గాల వారు భారీ ఎత్తున బెట్టింగ్లు కాసేందుకు బుకీల కోసం ఇప్పటి నుంచే వెదుకుతున్నట్లు సమాచారం. ఒక వేళ బుకీలు దొరకకపోతే వారందరూ కలిసి ఓ గ్రూపును రూపొందించుకుని బెట్టింగ్లు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని వినికిడి.
మన రాష్ట్రంలో బెట్టింగ్లపై నిషేధం ఉంది. దీంతో చాలా బెట్టింగ్ యాప్ సంస్థలు తమ ఐపీ అడ్రస్సులను మార్చి వాటిని ఇతర రాష్ర్టాల నుంచి నడిపిస్తున్నాయి. ఆ యాప్లను డౌన్లోడ్ చేసుకుని ఆడినా వాటి చిరునామా ఇతర రాష్ర్టాల లొకేషన్ చూపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. వీటిని పసిగట్టిన పోలీసులు ఆ బెట్టింగ్ యాప్లు మన రాష్ట్రంలో పని చేయకుండా ఉండేందుకు గూగుల్ సంస్థకు లేఖలు రాశారు. కాని ఆ సంస్థల నుంచి సానుకూల స్పందన కరువైందని తెలుస్తున్నది.
ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ బృందాలు బెట్టింగ్ స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి పలువురు బుకీలు, పందెంరాయుళ్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కోట్లాది రూపాయల బెట్టింగ్ రుసుంతో పాటు వాటితో కొనుగోలు చేసిన ఆస్తులు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 30 మందికి పైగా బుకీలు, పందెం రాయుళ్లను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ముఠాలు ఐపీఎల్తో పాటు విదేశాల్లో జరుగుతున్న ఇతర జట్ల క్రికెట్ మ్యాచ్లు, కౌంటీ మ్యాచ్లపై కూడా బెట్టింగ్ దందాలను నిర్వహించిన విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.