సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్.. విశ్వనగరంగా మారుతున్నదని క్రెడాయ్ ప్రశంసల వర్షం కురిపించింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోపై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా(క్రెడాయ్) స్పందించింది. గ్లోబ ల్ సిటీగా అభివృద్ది చెందుతున్న నగరంగా హైదరాబాద్ వేగవంతంగా ముందుకు సాగుతోందని, ప్రజా రవాణాను మరింత మెరుగుపర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రశంసిస్తూ శనివారం ట్వీట్ చేసింది. ఎయిర్ పోర్టు ఎక్స్ప్రెస్తో తెలంగాణ సరికొత్త బెంచ్మార్క్ను సొంతం చేసుకుందని, ప్రజా రవాణాలో నిజంగా ఇది గేమ్ ఛేంజర్ అని క్రెడాయ్ ఈ సందర్భంగా కితాబిచ్చింది.
సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నగరంలో మెట్రో రైళ్లలో ప్రయాణికుల సందడి నెలకొన్నది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇటీవల ఒకే రోజు 4.40 లక్షల మంది ప్రయాణం చేసినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇచ్చాయి. ఆ తర్వాత క్రమంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించడంతో ప్రస్తుతం 40-50 శాతం ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లు నిత్యం కిటకిటలాడుతున్నాయి.
కొత్త ఏడాదిలో జనవరి నుంచి 60-70 శాతం మంది ఐటీ ఉద్యోగులు రిటర్న్ టు ఆఫీస్ విధానంలో పనిచేసే అవకాశం ఉందని ఐటీ కంపెనీల అధికారులు తెలిపారు. నగరంలో మొత్తం ఐటీ ఉద్యోగులు 7.80 లక్షల మంది ఉన్నారు. వీరిలో ప్రసుత్తం పనిచేసే విధానం మూడు రకాలుగా ఉంది. కొందరు వర్క్ ఫ్రమ్ హోం, మరికొందరు వారం రోజుల పాటు ఆఫీసు నుంచే పనిచేస్తుండగా, ఇంకొందరు హైబ్రిడ్ విధానంలో 3 రోజులు ఆఫీసు , 2 రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు.
జనవరి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తీ పలికి, హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు కంపెనీలు నిర్ణయించాయి. ఈ కారణంగా ఐటీ కారిడార్కు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అధికారులు పరిశీలిస్తున్న ప్రతిపాదనలు…
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో 57 రైళ్లు ఉండగా… ఒక్కో రైలులో 3 కోచ్లు ఉన్నాయి. ఈ చొప్పున ఒక్కో రైలులో ఒకేసారి 1000 మంది వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. మూడు కోచ్లకు బదులుగా 4వ కోచ్ను పెంచడానికి ఇందులో అవకాశం లేదు. ఒకవేళ అదే రైలులో ఎక్కువ మంది ప్రయాణం చేయాలంటే మరో మూడు కోచ్ల అనుసంధానం చేసే విధానమే అందుబాటులో ఉంది. ఆ స్థాయిలో ఇప్పటికిప్పుడు ఎల్ అండ్ టీ మెట్రో కోచ్లను కొనుగోలు చేయడమనేది బడ్జెట్తో ముడిపడి ఉంది. ఇందుకు ఎల్ అండ్ టీ ముందుకొచ్చి 5-10 రైళ్లను కొత్తగా కొనుగోలు చేస్తే.. ఒక ట్రిప్పులో 5-10వేల మందికి అదనంగా వెసులుబాటు లభిస్తుంది.
ప్రస్తుతం రద్దీగా ఉండే ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం మార్గాల్లో మూడు నిమిషాలకో రైలు నడుస్తున్నది. ఈ క్రమంలో పీక్ అవర్స్లో తక్కువ సమయంలో ఎక్కువ రైళ్లను నడిపితే సమస్య పరిష్కారమవుతుంది. ప్రస్తుతం ఉన్న సాంకేతికత వెసులుబాటు ప్రకారం రెండు నిమిషాలకో రైలు నడిపేందుకు ఎలాంటి సమస్యలేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దీంతో కనీసం ఈ రెండు మార్గాల్లో ఫ్రీక్వెన్సీ పెంచడం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.
నగరంలోని మెట్రో రైలు నెట్ వర్క్లో అమీర్పేట ఇంటర్చేంజ్ అత్యంత కీలకమైంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న కారిడార్-1లో, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉన్న కారిడార్-3లో అమీర్పేట ఇంటర్చేంజ్లోనే రైళ్లలోని ప్రయాణికులు మారుతుంటారు. ఈ నేపథ్యంలో అమీర్పేట నుంచి ఐటీ కారిడార్లోని రాయదుర్గం వరకు మెట్రో రైళ్లను షార్ట్ లూప్ విధానంలో ప్రతి 3 నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నామని మెట్రో అధికారులు తెలిపారు. మరింత రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కనీసం ఈ మార్గంలో ప్రతి 2 నిమిషాలకో రైలును నడిపితే సమస్య పరిష్కారమవుతుందా? అనే అవకాశాలను ఎల్అండ్టీ పరిశీలిస్తున్నది.