కవాడిగూడ, ఏప్రిల్ 14: పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ వారికి మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే రాష్ర్టాల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ అనే నినాదంతో చేపట్టిన ‘ఇంటింటికీ సీపీఐ’ యాత్ర ప్రారంభ సభ జరిగింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ… దేశాన్ని పట్టి పీడిస్తున్న నాయకత్వం ఏదైనా ఉన్నదంటే అది మోదీ ప్రభుత్వమేనని మండిపడ్డారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేపట్టాలన్నారు. దళితుల చేతికి డబ్బులు ఇవ్వడం లేదని, ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తున్నానని… నిజాయితీగా ఓటు వేస్తే తల ఎత్తుకునేలా ఉంటారని, ఓటు అమ్ముకుంటే తల దించుకుని తిరుగుతారని బీఆర్ అంబేద్కర్ చెప్పాడని వారు గుర్తు చేశారు. మోదీకి 30 మంది దత్తపుత్రులున్నారని, ఇందులో 29 మంది ఫారిన్లో ఉంటే మరో అదానీ ఇక్కడే ఉన్నారని, ఆయనకు దేశ సంపదను మోదీ ప్రభుత్వం అప్పగిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్ బోస్, జాతీయ సమితి సభ్యులు ఎండీ యూసఫ్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల కార్యదర్శులు ఎస్. చాయాదేవి, జంగయ్య, డీజీ సాయిలు గౌడ్, విజయలక్ష్మి పండిత్, రాష్ట్ర సమితి సభ్యులు బి.స్టాలిన్, రవీంద్రాచారి, ఎస్ బాలరాజ్, యాదిరెడ్డి, పర్వతాలు, రామస్వామి, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎన్. నర్సింహ, కార్యదర్శి వెంకటేశ్, వర్కింగ్ ఉమెన్ కన్వీనర్ ప్రేమ్ పావని తదితరులు పాల్గొన్నారు.