సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఐపీఎల్-2024 మ్యాచ్లకు(IPL matches) పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి(CP Tarun Joshi) తెలిపారు. ఈ నెల 27వ తేదీన సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్కి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు, సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వాహణకు అవసరమైన అన్ని సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంకు వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా, అవసరమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. టిక్కెట్లు పంపిణీలోను ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సూచించారు. మ్యాచ్ జరిగే రోజు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు..