సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ), బడంగ్పేట : అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తే ఏమవుతుందిలే అనుకుంటున్నారేమో.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెండోసారి పట్టుబడితే మీ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసేస్తారు. అంతేకాదు.. క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేశ్భగవత్ హెచ్చరించారు. హయత్నగర్, ఉప్పల్, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, మీర్పేట, మందమల్లమ్మ ప్రాంతాల్లో శుక్రవారం సీపీ పర్యటించి ఏసీపీ పురుషోత్తంరెడ్డితో కలిసి వాహనదారులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ ఉల్లంఘనలపై రెండు రోజుల్లో 2,400 కేసులు నమోదు చేయగా.. ఇందులో 700 చలాన్లను రాత్రి సమయాల్లో విధించినవన్నారు. ఇలా.. రెండోసారి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వస్తే వారి వాహనాలను సీజ్ చేసి.. క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ఈ ఉల్లంఘనలపై ప్రతి ఎంట్రీ డాటాబేస్లో ఉంటుందని అన్నారు. దీంతో ఎవరైనా రెండోసారి రోడ్డుమీదకు వస్తే.. పోలీసు ట్యాబ్లో ఒక్క క్లిక్తో సమాచారం తెలిసిపోతుందన్నారు.