డ్రగ్స్ వాడినా.. విక్రయించినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు . ‘చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీ పోలీసింగ్, అతిక్రమిస్తే కఠినంగా ఉంటాం’ అని స్పష్టం చేశారు. నగరంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని, శిక్షల సంఖ్య కూడా పెరిగాయని వెల్లడించారు. శుక్రవారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర కమిషనరేట్ వార్షిక నివేదిక -2023ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ ఏడాది మొత్తం సిటీలో 22,214 కేసులు నమోదయ్యాయని, గతేడాది వీటి సంఖ్య 21,381గా ఉందన్నారు. రికవరీ శాతం గతేడాది 60.07 శాతం ఉంటే.. ఈ సంవత్సరం 74.15 శాతం పెరిగిందన్నారు. 7,137 కేసులను పరిష్కరించగా, అందులో 4,465 కేసుల్లో శిక్షలు పడినట్లు చెప్పారు. హెచ్న్యూ ఆధ్వర్యంలో 83 కేసులను ఛేదించామన్నారు. ట్రాఫిక్ విభాగంలో 37,866 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వార్షిక క్రైమ్ నివేదికను శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, నగర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పౌరుల భద్రతే లక్ష్యంగా 24/7 పోలీసులు పనిచేస్తున్నామన్నారు. 2023లో జరిగిన ప్రధాన పండుగలు, రాజకీయ పార్టీల సభలు, సమావేశాలన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, చట్టాన్ని అతిక్రమించే వారితో కఠినంగా ఉంటామని సీపీ వివరించారు.
హైదరాబాద్లో డ్రగ్స్ వాడేవారితో పాటు డ్రగ్స్ విక్రయించే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని, పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 350 కేసులు నమోదు చేసి, రూ. 36.81 కోట్ల నగదును సీజ్ చేశామన్నారు. నేరాలు పెరిగినా, శిక్షల శాతం (20 శాతం) పెరగడం సంతృప్తిగా ఉన్నదని సీపీ అన్నారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ బాగా పనిచేస్తుందన్నారు. వచ్చే ఏడాది శిక్షల శాతాన్ని మరింత పెంచే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. మహిళలపై లైంగిక దాడులు గతేడాదితో పోలిస్తే 12 శాతం పెరిగాయన్నారు. పిల్లలపై దాడులు, పోక్సో కేసుల సంఖ్య 12 శాతం తగ్గిందనీ, సైబర్ నేరాలు 12 శాతం పెరిగాయన్నారు.
ఈ ఏడాది మొత్తం సిటీలో 22,214 కేసులు నమోదయ్యాయి. గతేడాది వీటి సంఖ్య 21,381 ఉన్నది. కేసుల్లో రికవరీ శాతం గతేడాది 60.07 శాతం ఉండగా.. ఈ ఏడాది 74.15 శాతం పెరిగింది. 7,137 కేసులను పరిష్కరించగా, అందులో 4,465 కేసుల్లో శిక్షలు పడ్డాయి. శిక్షల శాతం 63 శాతం ఉన్నదని సీపీ వెల్లడించారు. 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు శిక్షలు పడ్డాయన్నారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో రూ. 9,675 కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. హెచ్న్యూ ఆధ్వర్యంలో 83 కేసులు ఛేదించినట్లు సీపీ వివరించారు. ట్రాఫిక్ విభాగంలో 37,866 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు స్వల్పంగా పెరిగాయన్నారు. సైబర్నేరాలు గతేడాది 2,457 ఉండగా.. రూ. 82 కోట్ల ఆర్థిక నష్టం జరిగిందని, ఈ ఏడాది 2,735 కేసులు నమోదు కాగా.. అందులో రూ. 133.59 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని వివరించారు.
ప్రస్తుతం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచే బాధ్యతలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక నుంచి వారంలో రెండు రోజులు బషీర్బాగ్లోని పాత కమిషనరేట్ కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తానని సీపీ తెలిపారు. ప్రజలకు మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతోనే పాత కమిషనరేట్ కార్యాలయం నుంచి సేవలు అందిస్తామన్నారు. అలాగే, ఓల్డ్సిటీలోని ఓల్డ్ కమిషనరేట్ కార్యాలయానికి మరమ్మతులు జరుగుతున్నాయని, పనులు పూర్తయితే అక్కడికి కూడా గత కమిషనర్లు వెళ్లినట్లు వెళ్తానన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రతి నెలా 16 వేల వరకు కొత్త వాహనాలొస్తున్నాయని, వాటికి తగ్గట్టుగా ట్రాఫిక్లో ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. 2023లో నగరంలో పనిచేస్తున్న పోలీసులపై వచ్చిన ఫిర్యాదులతో 8 మందిని ఉద్యోగంలో నుంచి తొలగించగా.. 50 మందిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కన్వాయ్ వెళ్తున్నప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సీఎం చెప్పారని, అయితే.. సీఎం భద్రత ప్రధానమైందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొత్త సంవత్సరం వేడుకలపై నిఘా ఉంటుందని, రోడ్లపైకి వచ్చి హంగామా చేయవద్దని సీపీ సూచించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు.