సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సిబ్బందికి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సిటీ పోలీస్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టాల అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై న్యాయ సలహాదారు రాములు వివరించారు.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నియామకాలు, పీపుల్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీ చట్టం, ఆయుధాల చట్టం, ఎక్సైజ్ చట్టం, హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, నివారణ పబ్లిక్ ప్లేసెస్ చట్టం, మోటర్ వాహనాల చట్టం, మతపరమైన సంస్థల వద్ద నిబంధనలు పాటించకుండా దుర్వినియోగం చేయడం వంటి చట్టాలు, తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ తేదీ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను న్యాయ సలహాదారు రాములు వివరించారు.
సీపీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. ఫ్లయింగ్ స్కాడ్ టీమ్స్, స్టాటిక్ టీమ్, నిఘా బృందాలు తమ వంతు పాత్ర నిర్వహించాలని సూచించారు. తనిఖీలు, సమాచారంతో అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఇతర వస్తువులు పట్టుకునే సమయంలో ఆదాయపన్ను శాఖతో సహా ఆయా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్రమ రవాణాను నియంత్రించాలన్నారు.