సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లు, ఎన్ఫోర్స్మెంట్.. తదితర ఎన్నికల విధులపై సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దిశా నిర్దేశం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటంతో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై సీపీ నగర పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొసిజర్, నివేదికలు సకాలంలో తయారు చేయడం, పర్యవేక్షణ, పోలీసు బలగాలకు సమగ్ర శిక్షణ అండ్ బ్రీఫింగ్ వంటి నాలుగు ప్రధాన అంశాలు ఎన్నికలు పూర్తయ్యే వరకు కీలకంగా ఉంటాయని సిబ్బందికి వివరించారు. ఆకస్మిక తనిఖీలు మరింత ముమ్మరం చేసేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీసీపీలు, ఏసీపీలు నోడల్ ఏసీపీలకు వారి వారి స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. తమ కార్యాలయాల్లో 24 గంటలూ పనిచేసే విధంగా ప్రత్యేక సెల్స్ను యాక్టివేట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పొరుగు కమిషరేట్ పరిధిలోని అధికారులతో సమన్వయ ప్రణాళికలు అవసరమన్నారు. అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ప్రలోభాలకు సంబంధించిన ఏమైనా సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ సిబ్బందికి సూచించారు.
ప్రచార సమయంలో వివిధ పార్టీలు ఒకే మార్గంలో ఎదురు పడకుండా చూసుకోవడం, ఇబ్బందులు రాకుండా రూట్ ప్లానింగ్, టైమింగ్ చూసుకొని అనుమతి ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. లైసెన్స్ పొందిన తుపాకులను తప్పని సరిగా పోలీసులకు అప్పగించాలని, ఎన్నికలు ముగిసే వరకు కొత్త లైసెన్స్ జారీ చేయకూడదన్నారు. స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు తమ తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయడం, సోషల్ మీడియాపై పర్యవేక్షణ, హవాల ఆపరేటర్లపై నిఘా, సమస్యాత్మక వ్యక్తులను బైండోవర్ చేయడం వంటి చర్యలపై చర్చించారు. సిటీ పోలీస్ ఫోర్స్ 100 శాతం ఫెసిలిటేటింగ్ సెంటర్ల ద్వారా ఓటు వేయాలని సూచించారు.
అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నోడల్ ఏసీపీల ద్వారా బాధ్యతలు వికేంద్రీకరణ, విజిబుల్ పోలీసింగ్ పెరుగుదల, చట్టపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎస్బీ అదనపు సీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఫీల్డ్ లెవల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను వివరించారు. నగదు, విలువైన లోహాలు, ఇతరాత్ర వస్తువులను స్వాధీనం చేసుకునే సమయంలో ఏకరీతిగా విధానాలు ఉండాలన్నారు. నకిలీ ఓటర్ ఐడీ తయారీదారులు, రవాణా సంస్థలు, కొరియర్ సర్వీస్ ప్రొవైడర్లపై నిఘా ఉంచడం, ఎన్నికల నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడం, పోలీసు బలగాలకు స్పష్టమైన సూచనలు అందించడం వంటి ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసే వరకు నగరంలో ట్రాఫిక్ విభాగం తీసుకునే చర్యల గూర్చి వివరించారు. ఎన్నికల సంబంధిత విధుల్లో నిమగ్నమైన పోలీసు అధికారులకు సంబంధించిన అంశాలు, డ్యూటీలపై సీఆర్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీ శ్రీనివాసులు వివరించారు.