సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): శాంతిని కాపాడటం, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బక్రీద్ సందర్భంగా మంగళవారం సాలార్జంగ్ మ్యూజియంలో జీహెచ్ఎంసీ, పశు సంవర్థక శాఖ అధికారులు, ముస్లిం మత పెద్దలు, ఖురేషీలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీసులు, జీహెచ్ఎంసీ, పశుసంవర్థక శాఖ సిబ్బంది సమన్వయంతో చెక్పోస్టులను నిర్వహిస్తున్నామన్నారు. పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. అధికారులకు తగిన దిశా నిర్దేశం చేశామని, పెట్రోలింగ్ ముమ్మరం చేసి అదనపు బలగాలు రంగంలో ఉంటాయన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక, జోనల్, కమిషనరేట్ స్థాయిలలో సమన్వయ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు జంతు అవయవాలు, వ్యర్థ పదార్థాలను సక్రమంగా పారేయాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మన నగరం గంగా- జమునా తహజీబ్ వంటింది.. శాంతిని కాపాడటం మన సమష్టి బాధ్యత.. పోలీసులు, జీహెచ్ఎంసీ, పశు సంవర్థక శాఖ అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశానికి హాజరైన వారు ఇచ్చిన సూచనలు, సలహాలను కూడా పరిగణలోకి తీసుకొని, సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ చేపట్టిన పారిశుధ్య చర్యల గూర్చి వివరించారు. వార్డులు, మసీదుల్లో అదనపు పారిశుధ్య బృందాలు, చెత్త సేకరణ వాహనాలు, చెత్త సంచులు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, సుధీర్బాబు, జాయింట్ సీపీలు శ్రీనివాసులు, గజారావు భూపాల్, ఎమ్మెల్యేలు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్, మత పెద్దలు ముఫ్తి ఖలీల్ అహ్మద్, ముంతాజ్ పాషా, హఫీజ్ ముజఫర్తో పాటు శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.