ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 22 : రంగారెడ్డిజిల్లాలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మెజార్టీ కార్పొరేటర్లు సంతకాలు చేసి గురువారం కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందజేశారు. అవిశ్వాస తీర్మానంపై సంతకాలు పెట్టినవారిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు చెందినవారున్నారు. ప్రస్తుతం మీర్పేట్ మేయర్గా దుర్గాదీప్లాల్, డిప్యూటీ మేయర్గా తీగల విక్రమ్రెడ్డి బీఆర్ఎస్పార్టీ నుంచి కొనసాగుతున్నారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కార్పొరేటర్లంతా క్యాంపునకు వెళ్లిపోయారు. ప్రస్తుతం మీర్పేట్ కార్పొరేషన్లో 46 మంది కార్పొరేటర్లున్నారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్లుగా బీఆర్ఎస్ నుంచి 24, కాంగ్రెస్ నుంచి 5, బీజేపీ నుంచి 16 మంది గెలుపొందారు. మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినవారిలో కాంగ్రెస్ నుంచి 7, బీజేపీ నుంచి 14, మిగిలినవారు బీఆర్ఎస్ అసమ్మతి కార్పొరేటర్లున్నారు. తీర్మానంపై సంతకాలు చేసిన కార్పొరేటర్ల సంతకాలను నిర్ధారించుకోవడానికి కమిషనర్కు పంపుతామని కలెక్టర్ తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో అవిశ్వాసాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్లపై అవిశ్వాసాల తీర్మానాలు పూర్తయ్యాయి. మణికొండ మున్సిపల్ చైర్పర్సన్పై కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా గురువారం బలపరీక్ష నిర్వహించారు. ఉప్పరిగూడ, బాటసింగారం సహకార సంఘాల చైర్మన్లపై కూడా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగా.. గురువారం బలపరీక్ష నిర్వహించారు.
చైర్మన్ కోర్టును ఆశ్రయించగా.. బలపరీక్ష వివరాలను అధికారులు గోప్యంగా ఉంచి సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు. ఈ నెల 28న బాటసింగారం సహకార సంఘం చైర్మన్పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి బలపరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలోని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్పై కూడా జడ్పీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.