ఊకదంపుడు ఉపన్యాసాలు.. ఉత్తుత్తి హామీలతో ఆర్భాటం చేసేవారిని మాటలతో కోటలు కడతారు అంటుంటారు. ఈ నానుడిని ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కూడా ఆపాదిస్తుంటారు. కానీ ఏ ఎన్నికల్లో కూడా ఆధునిక వైద్య సేవలపై ప్రగల్భాలకు పోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బస్తీ దవాఖానల్లో కనీవిని ఎరుగని తీరుగా వైద్య సేవలందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యాధునిక వైద్య సేవలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం నగరంలో ఏర్పాటు చేసిన వందలాది బస్తీ దవాఖానల్లో ఈ-వైద్య సేవలకు నాంది పలికింది. గతంలో ఆధునిక వైద్యం అందని ద్రాక్షగా మిగిలిపోయినా.. పేదలకు మేమున్నామంటూ నేడు బస్తీ దవాఖానలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి.
జూబ్లీహిల్స్, మార్చి 25: ప్రభుత్వ దవాఖానలంటే ఒకప్పుడు చిన్నచూపు.. గాంధీ నుంచి గల్లీ దవాఖాన వరకు ప్రజల్లో ఆ ఆలోచన మారలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ప్రభుత్వ దవాఖానలకు తీసుకెళ్లాలంటే వెరసేవారు. ఎక్కడో దైన్య స్థితిలో ఉన్న రోగులు ఆ దవాఖానలకు వెళ్లి బతుకుజీవుడా అంటూ ప్రాణాలరచేతబట్టుకుని బయటపడేవారంటే అతిశయోక్తికాదు. రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఆ పరిస్థితిలో క్రమంగా మార్పు వచ్చింది. నేడు నగరంలో ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో కనిపించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వందలాది బస్తీ దవాఖానలు కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నాయి.
పైలట్ ప్రాజెక్ట్గా జవహర్నగర్ ‘బస్తీ’..
బస్తీ దవాఖానలు నేడు కార్పొరేట్ వైద్యశాలలతో పోటీపడి లక్షలాది రూపాయల వ్యయంతో అయ్యే వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించనున్నాయి. ఇందులో భాగంగా అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 133 బస్తీ దవాఖానల్లో ఆన్లైన్ సేవలందించేందుకు పైలట్ ప్రాజెక్ట్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్ జవహర్నగర్ బస్తీ దవాఖానలో ఈ ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడి బస్తీ దవాఖానలో అందుతున్న ఆన్లైన్ వైద్య సేవలను సోమవారం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె.వెంకటి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుక్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
అనూహ్యంగా పెరిగిన ఆదరణ
బస్తీ దవాఖానలకు అపూర్వ ఆదరణ దక్కడంతో ప్రభుత్వం వాటి సంఖ్యను విస్తృతంగా పెంచడమే కాకుండా వీటిలో ఈ-హెల్త్ కార్డులను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. దవాఖానల్లో ప్రతిరోజు 100 నుంచి 200 ఓపీ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు ఆన్లైన్లో నాణ్యమైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా ఈ-ప్రిస్కిప్షన్ విధానంతో రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్, ల్యాబ్.. స్కానింగ్ రిపోర్ట్స్, మందుల సిఫారసు అన్నీ ఆన్లైన్లో చేపడుతున్నారు.
మంచి ఆదరణ వస్తున్నది..
జవహర్నగర్ బస్తీ దవాఖానలో రోగులకు అందిస్తున్న ఈ-హెల్త్ సేవలకు మంచి ఆదరణ వస్తున్నది. రోగులు ఒక్కరే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్తున్నారు. వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. రోగి కోసం చేపడుతున్న వైద్య పరీక్షల రిపోర్టులను వారి ఫోన్కు పంపిస్తున్నాం. అత్యవసర వైద్య సేవలు అవసరమున్న రోగులను సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ సూచనల మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు వెంటనే ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేగా కుండా వైద్య సేవలు త్వరితగతిన అందుతుండడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాలలో అన్నిరకాల వైద్య పరికరాలను కల్పించడంలో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – డాక్టర్ ఎన్.చందన, వైద్యాధికారి