బంజారాహిల్స్,జనవరి 17:ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీల్లో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలో కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. సోమవారం నియోజకవర్గంలోని 7 కేంద్రాల్లో 557 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, వారిలో 128 మందికి కరోనా సోకింది. పంజాగుట్ట ప్రతాప్నగర్ బస్తీలో 25 మందికి పరీక్షలు చేయగా వారిలో 11మందికి, జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, జవహర్ కాలనీల్లో 150మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 40మందికి పాజిటివ్గా తేలడంతో స్థానికులలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్7లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో 130మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 16 మందికి పాజిటివ్ అని తేలింది. షౌకత్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో 85మందికి పరీక్షలు చేయగా వారిలో 19 మందికి కరోనా సోకింది. ఫిలింనగర్లో 71మందికి పరీక్షలు చేయగా 11మందికి ,చింతల్బస్తీ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 96 పరీక్షలు చేయగా 31మందికి పాజిటివ్గా తేలింది. వారందరినీ హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు.
కరోనా బారిన పడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్
కరోనా పోరులో ముందు వరుసలో ఉంటున్న ఫ్రంట్లైన్ వారియర్స్లో కూడా కరోనా కలకలం రేగింది. ఇందిరానగర్లోని జూబ్లీహిల్స్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ నర్స్కు, బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్లో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐ కూడా కరోనా బారిన పడడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో ఆందోళన మొదలైంది.
జాగ్రత్తలు తీసుకోండి..
పదిరోజుల క్రితం మా కేంద్రంలో కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఈ వారంలో ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. రెండ్రోజులనుంచి భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు మా కేంద్రంలో 16మందికి కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలి. 60ఏండ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ ఇస్తున్నాం. వారికి తప్పకుండా టీకాలు వేయించండి. అప్రమత్తంగా ఉండకపోతే మరోసారి తీవ్రమైన ఇబ్బందులు తప్పవు.