‘ప్రాణాలు పోయినా.. ఇండ్లు ఖాళీ చేయం.. 450 కుటుంబాలను రోడ్డున పడేస్తారా.. గాంధీ విగ్రహం పెట్టేందుకు మీకు స్థలమే దొరకలేదా.. అప్పుడు మా అపార్ట్మెంట్ బఫర్ జోన్లో లేదని అనుమతిచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్లో ఉందంటున్నారు. మీ ఇష్టానుసారం నిబంధనలు మార్చుకొని.. మాకు అన్యాయం చేస్తారా? అసలు ఈ ప్రభుత్వానికి మూసీ నదీ గర్భం ఏదీ.. పరీవాహకం ఏదీ.. బఫర్ జోన్ ఏదీ.. అనే వివరాలు తెలుసా?’..అంటూ.. కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విశ్వనగరంగా విరాజిల్లిన గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. అల్లకల్లోలం సృష్టిస్తున్నది.
ఎక్కడ చూసినా ప్రజలకు ఇబ్బందులే కలగజేస్తున్నది. తాజాగా మూసీ పునరుజ్జీవం పేరిట ప్రజల ఇండ్లను ఖాళీ చేసి.. గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గాంధీ సరోవరం పేరిట మూసీ పరీవాహక ప్రాంతంలోని సుమారు 300 ఎకరాలను సేకరించడమే లక్ష్యంగా పట్టా భూములను లాక్కునేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. అందులో భాగంగానే ఇప్పటి వరకు దాదాపు 43 ఎకరాల పట్టా భూములను ప్రజల తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్లో అదే ప్రాంతంలో ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను కూడా చేర్చారు. గాంధీ సరోవర్లో ఆ అపార్ట్మెంట్ స్థలాన్ని కూడా చేర్చామని, ఇండ్లను ఖాళీ చేయాలని పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లో చెప్పాలని.. గడువు విధించారు. అయితే 20 ఏండ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నామని, ప్రాణాలు పోయినా.. ఇండ్లను ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసే ప్రసక్తే లేదని ఆ అపార్ట్మెంట్ వాసులు తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
-సిటీబ్యూరో/బండ్లగూడ/మెహిదీపట్నం, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)

మధు పార్క్ అపార్ట్మెంట్ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పరిహారం తదితరాలను వివరించేందుకు ఒకవేళ గ్రామ సభ నిర్వహిస్తే తమ అభ్యంతరాలను తెలిపేందుకు అపార్ట్మెంట్ వాసులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే తమ ఇండ్లను కాపాడుకునేందుకు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. గాంధీ సరోవర్ పేరిట ఇచ్చిన నోటిఫికేషన్లో పక్కనే ఉన్న గీతా రిచ్మండ్ విల్లాస్కు సంబంధించిన సర్వే నంబర్లు కూడా ఉన్నారు. ఆ విల్లాస్ యజమానులు కూడా మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు, పరిసర రైతులతో కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ గ్రామ సభ నిర్వహిస్తే.. అందులో అధికారుల వివరణ విన్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించి నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
గాంధీ సరోవరం పేరిట పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లను ఖాళీ చేసి వెళ్లమనడం సరికాదని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఓ పోస్ట్ట్ చేశారు. ‘ హైదరాబాద్ నగర నడిబొడ్డున గాంధీ పేరుతో సరోవరం నిర్మిస్తామని ప్రకటించి ప్రభుత్వం వేలాది మందిని నిరాశ్రయులను చేసే పనికి పూనుకున్నది. లక్షల కోట్ల రూపాయల విదేశీ రుణం తీసుకొచ్చి మూసీ తీరంలో వందల ఎకరాల వాణిజ్య వీధిని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం మీ ఇండ్లను ఖాళీ చేస్తే ఖరీదు చెల్లిస్తామని నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. మిత్రమా.. ఇల్లంటే నివాసం మాత్రమే కాదు. దాని చుట్టూ అల్లుకున్న జీవితం. దాని పునాదు మొదలు ఆ ఆవరణం అంతటా పెనవేసుకుని ఒదిగిన జ్ఞాపకాల సమూహం. మా పిల్లలు ఎదిగిన జ్ఞాపకాల సమూహం. మా పిల్లలు ఎదిగిన పర్యావరణ ప్రపంచం. మా పెద్దలు ఒదిగిపోయిన సముదాయం. భావోద్వేగాలు, బంధాలు, అనుబంధాల సమాహారం. అది మా చెమట చుక్కల సరోవరం. సమాజాన్ని కూల్చేసి సరస్సులు, సరోవరాలు నిర్మించడం స్మారకాలు కట్టడం ఎక్కడా జరగలేదు’. అని అన్నారు.
ఏండ్ల తరబడి మేం కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న కట్టుకున్న అపార్ట్మెంట్ ఇది. దీన్ని వదిలి వెళ్లలేం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల నుంచి వివిధ రూపాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రజలను ఇబ్బంది పెట్టి తనకు విగ్రహాలు కట్టాలని గాంధీ ఎన్నడూ కోరుకోరు. మా అపార్ట్మెంట్ కూల్చి ఇక్కడ జెయింట్ వీల్ కడతామని అంటున్నారు. జాయింట్ వీల్ సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముందు పెట్టుకోవాలి. మా ఇండ్లను కూలుస్తామంటే ఎలా ఒప్పుకుంటాం. ప్రభుత్వం ఏం చేసినా అందరి ఆమోదంతో చేయాలి.
-ఎంవీ రమణారెడ్డి, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసి
450 కుటుంబాలను రోడ్డు పాలు చేసి మెమోరియల్ ఏర్పాటు చేస్తామనటం ప్రజలను ఇబ్బందులు పెడుతూ తనకు విగ్రహాలు కట్టాలని గాంధీ కోరుకుంటారా? మా అపార్ట్మెంట్ ఖాళీ చేయడం వల్ల ఇక్కడి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందంటే చెప్పండి. వెంటనే ఖాళీ చేస్తాం కానీ.. మేం 20 ఏండ్లు నివసిస్తున్న మా ఇండ్లను ఖాళీ చేసి జాయింట్ వీల్స్, విగ్రహాలు, మ్యూజియంలు ఏర్పాటు చేస్తామంటే ఎలా ఒప్పుకొంటాం. గాంధీకి మెమోరియల్ ఏర్పాటుకు ప్రభుత్వానికి స్థలమే దొరకడం లేదా? కోర్టును ఆశ్రయించి మాకు న్యాయ జరిగేదాకా పోరాడతాం.
-శ్రీనివాసరెడ్డి, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు