సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ముషీరాబాద్కు చెందిన శివరామప్రసాద్ విశ్రాంత ఉద్యోగి. ఆంధ్రాబ్యాంక్ రిటైరీస్ పేరుతో విశ్రాంత ఉద్యోగుల కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. పాలసీ ప్రకారం రూ.9లక్షల వరకు వైద్య చికిత్స పొందవచ్చు. శివరామప్రసాద్కు 2020లో కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆగస్టు 7న దవాఖానలో చేరి చికిత్స పొంది దవాఖాన వైద్య ఖర్చులు మొత్తం రూ.4,51,555 చెల్లించి డిశ్చార్జి అయ్యారు.
అనంతరం వైద్య బీమా చెల్లింపుల కోసం సదరు సంస్థను సంప్రదించగా వారు మొదటి విడతలో రూ.1,81,507, రెండో విడతలో రూ.1,34,298 కలిపి మొత్తం రూ.3,15,805 చెల్లించారు. మిగతా రూ.84,195 రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉండగా నిరాకరించారు. దీంతో బాధితుడు వినియోగదారుల కమిషన్లో కేసు వేశారు. హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బీ.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సీ.లక్ష్మిప్రసన్న, నారాయణరెడ్డితో కూడిన బెంచ్ కేసును పరిశీలించి, ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం పాలసీదారుడికి రీయింబర్స్మెంట్ కింద రూ.84,195 చెల్లించాల్సిందేనని తెలిపారు. రీయింబర్స్మెంట్ నిరాకరించినందుకు రూ.20వేలు జరిమానా విధించి, కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు అందజేయాలని సూచించింది.