సికింద్రాబాద్ : అత్యంత వేగంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నిరంతరం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అత్యాధునిక సధుపాయాలతో మూత్రశాలలను నిర్మించి అందుబాటులోకి తీసుకాకురావడం జరిగిందన్నారు. ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మోడ్రన్ పబ్లిక్ టాయ్లెట్, ఆర్బన్ హాలూను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా నివారించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రెండు వేలకుపైగా టాయిలెట్లను నిర్మించడం జరిగిందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారని, దీనిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బీఓటీ పద్దతిలో మోడ్రన్ టాయ్లెట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ..జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరిస్తూ పారిశుద్ధ్య నిర్వాహణలో భాగస్వాములు కావాలని కోరారు. నగరాభివృద్ధిలో తొలిమెట్టుగా, స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో జీహెచ్ఎంసీ పలు ప్రాంతాల్లో మోడ్రన్ టాయ్లెట్స్ నిర్మాణాన్ని చేపట్టిందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు.
ఈ నిర్మాణంలో భాగంగా క్రాస్ వెంటిలేషన్ సదుపాయాలు సైతం కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జోనల్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి, డీసీ ముకుంద్రెడ్డి, ఈఈ సుదర్శన్తో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.