సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు డిస్కం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నగర శివారు సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్నగర్, మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్లలో నివాస ప్రాంతాలు, పరిశ్రమల కార్యకలాపాలు క్రమంగా విస్తరిస్తుండటంతో ప్రతి ఏటా 30శాతం మేర విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అందుకు అనుగుణంగా కొత్తగా లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయడంపై ప్రాంతాల వారీగా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే వెస్ట్ జోన్ పరిధి ఐటీ కారిడార్లోని కోకాపేటలో కొత్తగా సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని..
ప్రస్తుతం హెచ్ఎండీఏ కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ను సుమారు 500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నది. ఈ పనులు ఒకవైపు జరుగుతుండగానే, మరోవైపు రియల్ ఎస్టేట్ సంస్థ భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలకు సంబంధించిన పనులు మొదలు పెట్టింది. ఇవన్నీ పూర్తి కావాలంటే 2-3 ఏండ్లు సమయం పడుతుంది. దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో ఐటీ కార్యాలయాలు, నివాస ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని సబ్ స్టేషన్ నిర్మాణం (33/11కేవీ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు) చేపట్టేందుకు సర్కిల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
దీర్ఘకాలిక ప్రణాళిక
ప్రతి యేటా వేసవిలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సమ్మర్ యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లుగానే అభివృద్ధి చెందుతున్న నగర శివారు ప్రాంతాలను టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పరిగణలోకి తీసుకొని దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తున్నారు. డిమాండ్కు సరిఫడా విద్యుత్ అందుబాటులో ఉండటంతో సరఫరా చేసేందుకు అవసరమైన నెట్ వర్క్ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజినీర్లు, డివిజన్ ఇంజినీర్లు పర్యటిస్తూ భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
సర్కిళ్ల వారీగా అంచనాలను రూపొందిస్తే, వాటికి ప్రాధాన్యతా క్రమంలో నిధులను డిస్కం ఉన్నతాధికారులు కేటాయించనున్నారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ విజన్కు అనుగుణంగా 24 గంటల పాటు నిరంతరం మెరుగైన విద్యుత్ సరఫరాకు అవసరమైన నెట్ వర్క్ను నిర్మించే పనిలో డిస్కం ఉన్నతాధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఖర్చు ఎంతైనా భరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రమిస్తున్నారు.
గ్రేటర్ టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని సర్కిళ్లు