సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో సర్కార్ వైద్యానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా గాంధీ దవాఖానలో సుమారు రూ.37కోట్ల వ్యయంతో 200పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్ (ఎంసీహెచ్) భవన నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరం చేసిది. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చికిత్స అందించేందుకు అన్ని ప్రసూతి దవాఖానల్లో ఎంఐసీయూ వార్డులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం తెలంగాణ రాకముందు ప్రతి లక్షకు 92 మరణాలుండగా ప్రస్తుతం 43కు తగ్గుముఖం పట్టింది. అదే విధంగా శిశు మరుణాలు తెలంగాణ రాకముందు 36 ఉంటే ఇప్పుడా సంఖ్య 21కి తగ్గింది.
మాతా శిశు మరణాలను దాదాపుగా నిర్మూలించి, దేశంలోనే తొలి స్థానంలో నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నది. ఈ క్రమంలోనే మల్టీ స్పెషాలిటీ సేవలు అందించేందుకు హైదరాబాద్ నగరంలో 3 సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇటీవలే నిమ్స్లో 200పడకల ఎంసీహెచ్ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందే గాంధీలోనూ ఎంసీహెచ్ భవన నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు అల్వాల్లో నూతనంగా నిర్మించతలపెట్టిన 1000పడకల సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా 200పడకల ఎంసీహెచ్ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం హైదారబాద్ నగరంలో నిలోఫర్, పేట్ల బుర్జ్, సుల్తాన్బజార్ ప్రసూతి హాస్పిటల్, గాంధీ తదితర హాస్పిటళ్లలో మొత్తం సుమారు 2000 ప్రసూతి, పిడియాట్రిక్ పడకలు అందుబాటులో ఉండగా జిల్లా స్థాయి, ఏరియా హాస్పిటల్స్, యూపీహెచ్సీలలో మరో 250 పడకల వరకు పడకలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం నగరంలో మొత్తం సుమారు 2250ప్రసూతి, పిడియాట్రిక్ పడకలు అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీటికి తోడు గాంధీ, నిమ్స్, అల్వాల్ హాస్పిటల్స్లో మరో 600పడకలు అందుబాటులోకి రానుండడంతో నగరంలో మాతాశిశువులకు సంబంధించి పడకల సంఖ్య 2850కి చేరనుంది. అంటే దాదాపు 3000కు చేరువ కానుంది. దీని వల్ల మాతా శిశువుల ఆరోగ్యానికి మరింత బరోసా ఏర్పడనున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం గాంధీ దవాఖానలో ప్రసూతి సేవలకు సంబంధించి సుమారు 300పడకలు, చిన్నపిల్లలకు సంబంధించి సుమారు 100పడకలు అందుబాటులో ఉన్నాయి. నూతనంగా నిర్మించనున్న 200పడకల ఎంసీహెచ్ భవనం అందుబాటులోకి వస్తే మాతా శిశువులకు సంబంధించిన పడకల సంఖ్య 600కు చేరుతుంది. దీని వల్ల గర్భిణులకే కాకుండా ప్రసవించిన తల్లులతో పాటు శిశువులకు సేవలు విస్తరించనున్నాయి. దీని వల్ల రోగులకు ముఖ్యంగా మరింత సత్వర చికిత్స అందుతుంది. అత్యవసర సేవలు మరింత చేరువవుతాయి. ముఖ్యంగా ఎక్కువ మంది రోగులకు సేవలు అందించగలుగుతాం.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ హాస్పిటల్