హైదరాబాద్ : దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) ఆరోపించారు. శనివారం ఆజంపురాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం, మైనారిటీలకు మెరుగైన జీవనస్థితిగతులను కల్పించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమయ్యిందని విమర్శించారు. ఉన్నత విద్యాభ్యాసం అందించకుండా నిరక్ష్యరాసులు గా మిగిల్చిందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీల సంక్షేమానికి కేవలం రూ. 2,219.57 కోట్లు ఖర్చు చేయగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) 9 సంవత్సరాల్లో రూ.10,139.11 కోట్లను ఖర్చు చేశారని స్పష్టం చేశారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపారని ప్రశంసించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలో 95 లక్షలు ఉన్న మైనార్టీలకు రూ. 2,100కోట్లు, రాజస్థాన్ (Rajasthan)లో 78.06లక్షలకు రూ. 1,973 కోట్లు, బిహార్లో 1.77కోట్ల మైనార్టీల జనాభాకు కేవలం రూ. 700కోట్లు, జార్ఖండ్లో 62.98లక్షలకు రూ. 320.8కోట్లు ఖర్చు చేశారని అన్నారు. దేశంలోని 25కోట్ల మైనార్టీల జనాభాకు కేంద్ర ప్రభుత్వం రూ. 3,097 కోట్లను మాత్రమే కేటాయించిందని ఆరోపించారు.
రాష్ట్రం వ్యాప్తంగా 204 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను ఏకకాలంలో ఏర్పాటు చేసి నిరుపేదలైన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తుందని తెలిపారు. స్కూళ్లను అప్గ్రేడ్ చేస్తూ కాలేజీలను కూడా ఏర్పాటు చేశామన్నారు.
రేవంత్ రెడ్డిది ఆర్ఎస్ఎస్ భావజాలం..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తని మహమూద్ అలీ ఆరోపించారు. మైనార్టీల పై కల్లబొల్లి వాగ్దానాలు చేస్తూ మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో పథకాల పేరుతో ఆకర్శించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని, మైనార్టీ డిక్లరేషన్ ద్వారా ఒరిగేది ఏమీ లేదన్నారు. అమలుకు సాధ్యం కాని పథకాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసేందుకు వాగ్దానాలను ఇస్తుందని విమర్శించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.