Congress Social Media | సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): సీసీఎస్ వద్ద గురువారం హైడ్రామా నెలకొన్నది. ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చిన కొద్దిసేపటికే సిటీ సైబర్క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ పోలీసుల నుంచి వారిని కాపాడేందుకేనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. గురువారం సీసీఎస్ వద్ద చోటుచేసుకున్న ఈ నాటకీయ పరిణామాలకు సంబంధించి..వివరాలివి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోలను మార్ఫింగ్ చేశారని కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులపై ఢిల్లీలో కేసు నమోదైంది.
రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది. వీడియో మార్ఫింగ్ చేసి సర్క్యూలేట్ చేసిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులను అరెస్టు చేసేందుకు గురువారం ఢిల్లీ నుంచి అక్కడి సైబర్క్రైమ్ పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు.. వారి కంటే ముందే కాంగ్రెస్కు చెందిన ఐదుగురు సోషల్ మీడియా ప్రతినిధులను అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. ఈ సమాచారం మీడియా ప్రతినిధులకు తెలియడంతో నిర్ధారణ కోసం సీసీఎస్కు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.
కేసు విచారణ సాగుతున్నదని, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదంటూ మధ్యాహ్నం వరకు పోలీసులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు ఉన్నట్లు ఒక వీడియో బయటకు వచ్చింది. దీంతో నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారా..లేదా అనే విషయాన్ని చెప్పాలంటూ..మీడియా ప్రతినిధులు సీసీఎస్ వద్దే ఉండి.. ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నించారు.
అయితే మీడియాకు సీసీఎస్ లోపలికి అనుమతి లేదంటూ.. బయటకు తోసేసే పనిచేశారు. నిందితుల సమాచారం బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన బాధితుల సెల్ఫోన్లను సైతం బయటే పెట్టి పోవాలని, దర్యాప్తు అధికారులు ఎవరైనా పిలిస్తేనే లోపలికి వెళ్లాలని, లేకుంటే ఎవరినీ అనుమతించేది లేదంటూ అక్కడున్న సిబ్బంది వచ్చిన వారిని బయటకు పంపించారు. కాగా, మిట్ట మధ్యాహ్నం మండుటెండల్లో.. సీసీఎస్ బయట మీడియా ప్రతినిధులు సమాచారం కోసం ఎదురు చూశారు.
మీడియాను బయట ఉండమని చెప్పలేదు. సమాచారం వస్తే చెబుతామని మీడియాకు సూచించాం. ఇప్పటికైతే ఆ సమాచారం మాకు కూడా తెలియదు. వెళ్లిపోవాలంటూ సూచించాం. ఎండలో ఇంకా ఉన్నారనే విషయం తమకు కూడా తెలియదంటూ సీసీఎస్ అడ్మిన్ ఏసీపీ అప్పలనాయుడు ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు.
సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కొందరు తమ అదుపులో ఉన్నారని సీసీఎస్ సైబర్క్రైమ్ ఏసీపీ శివ మారుతి నిర్ధారించారు. వారిని విచారించి వివరాలు తీసుకుంటున్నామన్నారు. అయితే, హైదరాబాద్ పోలీసులు నిందితులకు రక్షణగా ఉన్నా, అరెస్ట్ చేసినా వారికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి.. పంపించే అవకాశాలుండటంతో ఢిల్లీ పోలీసులు నిందితుల కోసం సీసీఎస్ బయట చక్కర్లు కొడుతూ కనిపించారు.
సీసీఎస్ పోలీసులు వారిని విడుదల చేయడంతోనే తాము అరెస్ట్ చేసి తీసుకెళ్లాలనే భావన ఢిల్లీ పోలీసుల్లో ఉండటంతో సైబర్క్రైమ్ పోలీసులు రాత్రి వరకు కూడా తమ అదుపులో ఉన్న వారిని అరెస్ట్ చేశారా.? నోటీసులు ఇచ్చి పంపుతున్నారా? అనే విషయాన్ని నిర్ధారించడంలో తడబడ్డారు. ఇదిలాఉండగా.. గురువారం ఉదయమే నిందితుల కోసం బేగంబజార్ పోలీసుల సహకారంతో ఢిల్లీ పోలీసులు గాంధీభవన్లో సోషల్మీడియా వారియర్స్ గురించి వాకబు చేసినట్లు తెలిసింది. వాళ్లు అక్కడ లేరని నిర్ధారించుకున్న తర్వాతే సీసీఎస్లో ఉన్నారనే సమాచారంతో అక్కడి పరిసరాల్లోనే మకాం వేసినట్లు సమాచారం.