ఖైరతాబాద్, మార్చి 10 : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ జేఏసీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారని, కానీ చట్టసభల్లో మాత్రం జనాభా దామాషా ప్రకారం వాటా దక్కడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే మాదిగలకు రెండు లోక్సభ, ఒక ఎమ్మెల్సీ కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ 14, బీఆర్ఎస్ 13 ఇస్తే కాంగ్రెస్ పది సీట్లు మాత్రమే కేటాయించిందన్నారు.
ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుందని, మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యతనివ్వలేదని, మంత్రివర్గ విస్తరణలో సైతం మాదిగలకు న్యాయం జరుగలేదన్నారు. నామినేటెడ్ పదవులను సైతం కేటాయించలేదన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తమకు హామీ ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారురు. త్వరలోనే గాంధీభవన్కు వెయ్యిమందితో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో మాదిగ శక్తి వ్యవస్థాపకులు సురేందర్ సన్నీ, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గడ్డ యాదయ్య, డాక్టర్ సంజీవ్ నాయక్, బుదాల బాబు రావు తదితరులు పాల్గొన్నారు.