ఘట్కేసర్, మే 4: ఘట్కేసర్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 400 మందికి పైగా రాజీనామాలకు సిద్ధమైనట్లు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ హెచ్చరించారు. ఆయన సూచన మేరకు కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నివాసానికి సోమవారం ఉదయం వెళ్లి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఘట్కేసర్ పట్టణ నాయకులతో చర్చించిన అనంతరం వారితో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వద్దకు వెళ్లి సమస్యను వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మే 11న మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు ముందే రైల్వే వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని లేని పక్షంలో సామూహిక రాజీనామాలకు దిగుతామని మంత్రికి వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి నిధుల మంజూరుపై అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.