కంటోన్మెంట్, ఏప్రిల్ 15: కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదని బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం బోయిన్పల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలతో కలిసి రావుల శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్నకు ప్రజలతో మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రజలందరి ఆశీర్వాదంతో కంటోన్మెంట్లో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 30 ఏండ్లుగా కంటోన్మెంట్లో సాయన్న చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని, కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన నివేదితను కంటోన్మెంట్ అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్కు క్యాడర్ లేదని, బీజేపీకి అభ్యర్థి లేడని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుందని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి కంటోన్మెంట్కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్కు ఉచిత మంచినీటి పథకాన్ని అమలు చేయడంతో పాటు డబుల్ ఇండ్లు కట్టించి ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇటీవల కాలంలో నీటి ఎద్దడిని సైతం ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, కంటోన్మెంట్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నేడు బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
30 ఏండ్ల ప్రజాజీవితంలో ఉన్నా.. ఉండడానికి సొంత ఇల్లు కూడా సాయన్న కుటుంబానికి లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి గుర్తు చేశారు. ప్రజలతో మంచి అనుబంధం ఉన్న సాయన్న కుమార్తె నివేదితను అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఇతర పార్టీలు కూడా నివేదితకు మద్దతివ్వాలన్నారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు బీజేపీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, నేతలు జంపన ప్రతాప్, అమరేందర్రెడ్డిలతో పాటు పలువురు నేతలు ఆలోచించుకోవాలని, కలిసికట్టుగా నివేదితకు సంపూర్ణ మద్దతు పలికితే కంటోన్మెంట్ వాసులు హర్షిస్తారని చెప్పారు. డబుల్ ఇండ్లపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కావాలని కొందరు దళారులుగా మారి ఇష్టానుసారంగా సాయన్న కుటుంబంపై విమర్శలు చేయడం తగదన్నారు. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
సాయన్న కుటుంబంపై నమ్మకంతో తనను అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్సీ కవితకు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధన్యవాదాలు తెలిపారు. సాయన్నలాగే తాను కూడా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, పాండు యాదవ్, లోకనాథ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు హరి, నర్సింహ యాదవ్, ధీననాథ్ యాదవ్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.