ముషీరాబాద్, ఏప్రిల్ 20: రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు, అనారోగ్య మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఫలితంగా జర్నలిస్టులు ఆర్థిక,ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో జరిగిన దివంగత సీనియర్ జర్నలిస్టు యడ్లపల్లి నాగరాజు సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మామిడి సోమయ్య మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. ఏళ్ళతరబడి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇవ్వకపోవడం, సరైన వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఎంతో మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల సంక్షేమానికి నూతన పాలసీ తీసుకువచ్చి సంక్షేమ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య ఆరోగ్య సదుపాయం కల్పిస్తూ హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఆర్థిక,ఆరోగ్య సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో పనిచేసిన యడ్లపల్లి నాగరాజు నిబద్ధత కలిగిన జర్నలిస్టు అని ఆయన కొనియాడారు.