సిటీబ్యూరో : నగర రవాణా వ్యవస్థలో కలికితురాయిలా నిలుస్తుందనుకున్న మెట్రోరైల్ రెండో దశ ఇప్పటివరకు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్అండ్టీ నుంచి మొదటి దశను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవడం ఒకటైతే… లక్షలాది మంది ప్రజ లు ఎదురుచూస్తున్న రెండో దశ విస్తరణ అడుగు ముందుకు పడకపోవడం మరో ఎత్తు. స్వాధీనం చేసుకున్నాం, ఇక విస్తరణ చేస్తామంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్పా రెండున్నరేండ్లలో ఇంచు కూడా కదల్లేదు.
రూ. 45వేల కోట్ల అంచనాతో విస్తరణ ప్రణాళికలు రూపొందించిన సర్కారు… క్షేత్రస్థాయిలో కనీసం అనుమతులు కూడా తీసుకురాకుండా, అటు కేంద్రం ప్రాజెక్టు ను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నాయి. మెట్రో రెండో దశపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, క్షేత్రస్థాయిలో జరుగుతు న్న పనులకు పొంతనేలేదు. బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ వంటి చోట్ల ఏడాదికేడాది కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ హైదరాబాద్లో మాత్రం కేవలం రూట్ మ్యాపుల మార్పులు, సర్వేల పేరుతోనే కాలయాపన జరుగుతున్నది. గతంలో సిద్ధం చేసిన డీపీఆర్లను పక్కనపెట్టి, కొత్త వాటి పేరు తో కాలం గడుపుతుందనే విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా మేడ్చల్, శామీర్పేట వంటి నార్త్ సిటీ కారిడార్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వేలాది మంది ఐటీ, ఫార్మా ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్లో నరకం చూస్తున్నారు. ముఖ్యంగా మేడ్చల్ వైపు మెట్రో వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది స్థానికులకు నిరాశే మిగులుతున్నది. గంటల తరబడి ట్రాఫిక్లో ఉం డటంతో అటూ ఇంధన రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కావడంతోపాటు, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభా వం చూపుతున్నది. ముఖ్యంగా విపరీతమైన వాహన రద్దీతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం నగర మెట్రో ప్రాజెక్టుకు శాపంగా మారింది. ఫండింగ్ విషయంలో కేంద్రం అడ్డంకులు సృష్టించి, రాష్ట్ర ప్రభుత్వం వాటిని గట్టిగా నిలదీయడంలో విఫలం అవుతుందనే ఆరోపణలున్నాయి. ఎల్ ఆండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్న ఉత్సాహాన్ని విస్తరణపై ఎందుకు చూపడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే రూట్ మార్పుల మార్పిడి జరుగుతుందనే ఆరోపణలు ఓ వైపు, నిధుల కొరతతో ప్రాజెక్టు ముందుకు కదులుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చేతికంటిన చమురు వదిలినా..ఫలితం లేని చందంగా మెట్రో నిర్వహణను తీసుకున్న ప్రభుత్వం తక్షణమే రెండో దశకు మో క్షం కలిగించేలా కార్యాచరణ రూపొందించాలని నార్త్ సిటీ మెట్రో సాధన సమితి డిమాండ్ చేస్తున్నది. తమ ప్రాంత ప్రయోజనాల విషయంలో ఇప్పటివరకు జాప్యం జరిగింది. కనీసం ఇప్పటికైనా సర్కారు తక్షణమే మెట్రో రెండో దశకు కేంద్రం నుం చి అనుమతులు తీసుకువచ్చి.. ముందుగా తమ ప్రాంతానికి మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పనులు మొదలుపెట్టినా… నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసే ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలంటున్నారు.