హైదరాబాద్ : వ్యవసాయం గురించి అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డిని సివిల్ సప్లై మంత్రిగా పెట్టి రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) చెలగాటమాడుతుందని బీజేపీ ఎల్పీ నాయకుడు (BJP LP leader ) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar reddy) ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నానా రకాలుగా మోసం చేస్తోందని దుయ్యబట్టారు. 45 రోజులుగా పండించిన ధాన్యాన్ని(Paddy) కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలు, పిడుగు పాటుతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 40 కిలోల బస్తాకు 3 నుంచి 4 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని, దీని వెనుక మాఫియా (Mafia) నడుస్తుందని ఆరోపించారు. ఈ మాఫియాను నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వం 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు.
కల్లాల్లోని ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సన్నవడ్లతో పాటు దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా రూ.2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే చేయాలని , రైతుల సమస్యలను పరిష్కరించే వరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.