వెంగళరావునగర్, మార్చి 18 : గరీబోళ్లపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. 60 ఏండ్ల నుంచి నివాసముంటున్న గరీబోళ్ల ఇండ్లపై బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడింది. పేదల ఇండ్లను కూల్చేసింది. వెంగళరావునగర్లోని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుమారు 3 ఎకరాల స్థలంలో సుమారు పది కుటుంబాలు గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. హైడ్రా బుల్డోజర్లతో బుధవారం విరుచుకుపడింది. నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను నేలమట్టం చేశారు. ఇది ప్రభుత్వ భూమి కానే కాదని.. ప్రైవేట్ స్థలమని.. హైడ్రా అధికారులు కూల్చివేతల పై హైకోర్టు తలుపు తడ్తామని న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు. పండుగ ముందు తమకు గూడు లేకుండా చేశారని బాధితులు విలపించారు.
నిలువ నీడ లేకుండా చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించిన బాధితులు హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదుపులోకి తీసుకుని డీసీఎంలో తరలించారు. కూల్చివేలతపై కనీసం తమకు హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వలేదని బాధితులు వాపోయారు. కండ్లదుటే ఇండ్లను అధికారులు కూల్చేస్తుండటంతో బాధితుల్లో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు.
‘హైడ్రా చెబుతున్నట్టు ఇది సర్కార్ స్థలం కానే కాదు…ఇది ప్రైవేట్ స్థలం.. చెప్పా పెట్టకుండా వచ్చి కూల్చివేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా వారు వచ్చి ఇప్పుడు ప్రభుత్వ స్థలమని చెబుతున్నారు. దీని పై మేము హైకోర్టును ఆశ్రయిస్తాం.. హైకోర్టులో రిట్ పెండింగ్లో ఉంది’. అని న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు. ఇదిలా ఉంటే హైడ్రా చేపట్టిన కూల్చివేతల దృశ్యాలను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై హైడ్రా సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, వారు చిత్రీకరించిన వీడియోలను డిలీట్ చేయించారు. దీంతో మీడియా ప్రతినిధులు మధురానగర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.