కంటోన్మెంట్ : ఆరు గ్యారెంటీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ (BRS) మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి (Ragidi Lakshmareddy) విమర్శించారు. ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ వంటి అన్ని పథకాల్లో మోసం చేశారని దుయ్యబట్టారు. ఆదివారం వెస్ట్ మారేడుపల్లిలోని నెహ్రూ నగర్ పార్కులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Rajashekar Reddy), బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలతో కలిసి వాకర్స్తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భారీ మెజారిటీతో గెలిపిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కేసీఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ను ప్రపంచ దేశాలు ప్రశంసించేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన తర్వాత రేవంత్రెడ్డి (Revanth Reddy) నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగించుకోలేక పోయారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్కాజిగిరి(Malkajigiri) నియోజక వర్గం అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలను ఖర్చుచేశారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.