బడంగ్పేట, నవంబర్ 5: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు గులాబీ గూటికి వస్తుంటే ఆ పార్టీల నాయకుల గుండెలు గుబేల్ మంటున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. బాలాపూర్ మండల పరిధిలోని బాలాజీనగర్లో మైనార్టీల సమ్మేళనం, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ అధ్యక్షుడు వీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వాసులతో సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మీర్పేటలో బలిజ సంఘం ఆధ్వర్యంలో తిరుమల ఫంక్షన్ హల్ నిర్వహించిన క్షత్రియ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. కాలనీ వాసులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధికి ముఖ్య మంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. సీఎం నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఆమె పిలుపు నిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే నష్ట పోతామన్నారు. సంక్షేమాన్ని గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కాంగ్రెస్లో మూడు గంటలు కరెంట్, బీజేపీ ప్రభుత్వం ధర భారం మోపుతుందన్నారు. అలాంటి వారికి ఓట్లు వేస్తే మురికి కుంటలో వేసినట్లేనన్నారు. మతం పేరుతో కులం పేరుతో ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్న బీజేపీకి గుణ పాఠం చెప్పాలన్నారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో కార్పొరేటర్ సూర్ణ గంటి అర్జున్ ఆధ్వర్యంలో నైన్ హిల్స్ కాలనీ, సప్తగిరి, శ్రీనిలయ, లిబ్రా, మారుతి నగర్, వసతం విహార్ తదితర కాలనీలో ఇంటింటికీ ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కార్తీక్ రెడ్డి, మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల బీరప్ప, అనిల్ కుమార్ యాదవ్, ధనలక్ష్మి రాజ్ కుకుమార్, నవీన్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాలనీ సంక్షేమ సంఘాలు పాల్గొన్నారు.