జీడిమెట్ల, అక్టోబర్ 11 : కాంగ్రెస్, బీజేపీ నేతలు కండ్లున్నా చూడలేని కబోదులుగా వ్యవహరిస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. యాబై ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఏం చేసిందని, బీజేపీ అధికారంలో ఉండి ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో వందేండ్ల అభివృద్ధి చేసిందని తెలిపారు. బుధవారం సాయంత్రం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్నగర్ డివిజన్కు చెందిన బీజేపీ నాయకులు, సూరారం డివిజన్కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మూసాఖాన్ ఆధ్వర్యంలో 200 మంది పేట్బషీరాబాద్లోని ఎమ్మెల్యే నివాసానికి తరలివెళ్లి బీఆర్ఎస్ పార్టీలో చేశారు. వారికి ఎమ్మెల్యే వివేకానంద్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేశామని తెలిపారు. ప్రతి కాలనీని అభివృద్ధి పర్చామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కావాలనే సీఎం కేసీఆర్పై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, మరి ఇక్కడి పథకాలు వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు.
మొన్ననే పక్క రాష్ట్రం కర్ణాటకలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారని, మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే మన పరిస్థితి కూడా అక్కడికే వస్తుందని, వందేండ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉన్నదని, మూడవ సారి అత్యధిక మెజార్టీ స్థానాలను గెలుపొంది అధికారం చేపట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సుభాష్నగర్ డివిజన్ తెలుగు తల్లి కాలనీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు (తెలంగాణ గద్దర్), జన నాట్య మండలి కళాకారుడు శ్రీనివాస్గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు కమలాకర్, కస్తూరి బాలరాజు, పర్శ శ్రీనివాస్గౌడ్, నవాబ్, అబేద్ హుస్సేన్, సాయి, నగేశ్, పందిరి యాదగిరి, రాధాకృష్ణ, కృష్ణగౌడ్, దేవాగౌడ్, అర్జున్గౌడ్, కళాకారులు బుర్రకంట రవికుమార్గౌడ్, మురళిగౌడ్, జయన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.