Crime news : కర్ణాటక (Karnataka) లో అత్యంత దారుణం జరిగింది. ధార్వాడ్ (Dharwad) లోని ఓ అపార్ట్మెంట్లో 45 ఏళ్ల అనస్థీషియా వైద్యుడు (Anesthesia Doctor) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడూ కత్తి పోట్లతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, వృత్తిరీత్యా కంటి వైద్యురాలు (Ophthalmologist) అయిన డాక్టర్ ప్రియాంక (Doctor Priyanka) ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చిరాయు ఆసుపత్రిలో అనస్థీషియా నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్, ఆయన భార్య డాక్టర్ ప్రియాంక, వారి కుమారుడితో కలిసి ఓ సెక్యూర్డ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. కిరణ్ కుటుంబసభ్యులు గురువారం ఆయనకు ఫోన్ చేయగా.. ప్రియాంక పొంతనలేని సమాధానాలు చెప్పారు. కిరణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత బయటకు వెళ్లారని చెప్పడంతో అనుమానం వచ్చిన బంధువులు సాయంత్రం నేరుగా అపార్ట్మెంట్కు వెళ్లారు.
అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న కిరణ్ను, మరో గదిలో కత్తి గాయాలతో పడి ఉన్న వారి కుమారుడిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికీ చిన్నారి ఊపిరి పీల్చుకుంటుండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భార్యాభర్తలు, వారి కుమారుడు ముగ్గురే ఉన్నారని, బయటి వ్యక్తులెవరూ లోపలికి ప్రవేశించిన ఆనవాళ్లు లేవని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రస్తుతం ప్రియాంక షాక్లో ఉన్నారని, విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కిరణ్ మృతికి ప్రియాంకే కారణమని బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ, పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. సబర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని, సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక, పూర్తిస్థాయి విచారణ తర్వాతే హత్యకుగల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని వెల్లడించారు.