ఎన్నికల నగారా మోగింది. సోమవారం మధ్యాహ్నమే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గ్రేటర్లో రాజకీయ వేడిమి రాజుకున్నది. ఓ వైపు షెడ్యూల్ ఖరారైనా.. ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు హస్తిన బాటలో నేతలు ఉండడంతో స్థానిక నేతల్లో ఆందోళన నెలకొన్నది. మరో వైపు కారు పార్టీ అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో దూసుకుపోతున్నారు. రెండు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రజలతో మమేకమై ఇప్పటికే తొలి దఫా ప్రచారాన్ని ముగించారు. ప్రధాన పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఇక గల్లీలు, కాలనీల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీ ప్రచారం చేయనున్నారు. పోల్ పోరులో మాటల తూటాలు, సవాల్-ప్రతిసవాల్లతో రాజకీయం ఊపందుకోనుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో ప్రచార పర్వంలో ఓట్ల పండగ రసవత్తరంగా జరగనున్నది.
సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ): ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో గ్రేటర్లో రాజకీయ వేడి రాజుకుంది. నవంబర్ 3న నామినేషన్, 30న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా సోమవారం మధ్యాహ్నమే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో శంకుస్థాపనలు, ఆవిష్కరణలు ఆగిపోయాయి. ఇక ప్రభుత్వ పరంగా కొత్త పథకాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు, జీవోలు జారీ చేసేందుకు వీలు ఉండదు. ఇందులో భాగంగానే రాజకీయ వేడి రాజుకున్నది. ప్రధాన పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక గల్లీలు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీ ప్రచారం చేయనున్నారు. పోల్ పోరులో మాటల తూటాలు, సవాల్-ప్రతిసవాళ్లలో రాజకీయం ఊపందుకోనుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, అంతర్గత సమావేశాలతో పాటు స్టార్ క్యాంపెయిన్లను ప్రచార పర్వంలోకి దించి ఓట్ల పండగ రసవత్తరంగా సాగనుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గడిచిన రెండు నెలలుగా జనంతో మమేకమై నియోజకవర్గాన్ని చుట్టేసి తొలి దఫా ప్రచారాన్ని ముగించారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం, పార్టీకి బలమైన ఆదరణతో పాటు తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన ప్రగతితో అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకలాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, అంతర్గత సమావేశాలతో పాటు స్టార్ క్యాంపెయిన్లను ప్రచార పర్వంతో 52 రోజుల పాటు గ్రేటర్ రాజకీయం రసవత్తరంగా సాగనుంది. అయితే ఇప్పటికే గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రజాక్ష్రేత్రంలోనే ఉంటూ అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టారు. బూత్ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు, ఆత్మీయ సమావేశాలు, పాదయాత్రలతో హోరెత్తించారు. తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన ప్రగతి మీ కళ్లముందు ఉందని, మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజలను అభ్యర్థించారు. ఇదే సమయంలో ఈ నెల 15 తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందేలా ప్రత్యేక వ్యూహాలతో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రతిపక్షాలు పార్టీ అభ్యర్థుల ఎంపికలోనే తడబడుతున్నది. షెడ్యూల్ వచ్చిన అభ్యర్థి ఎవరో తెలియక ఆ పార్టీ క్యాడర్ నిరాశలోకి వెళ్లి ఒక్కొక్కరుగా కారు ఎక్కుతున్నారు. దీంతో గ్రేటర్లో గులాబీ గుభాళిస్తోంది.