రామంతాపూర్(సికింద్రాబాద్) : అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి (BRS candidate) రాగిడి లక్ష్మారెడ్డి ( Ragidi Lakshmareddy) ఆరోపించారు. గురువారం హబ్సిగూడ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఉప్పల్ ఇన్చార్జి జహంగీర్ పాషతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ బస్తీల బాధలు తీరుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తరువాత కేసీఆర్(KCR) నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి తనను ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు.