దుండిగల్, మే 6 : కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుకు గ్యారెంటీ లేదని, అసలు ఐదేండ్లు ఈ ప్రభుత్వం ఉంటుందనడానికి గ్యారెంటీ సైతం లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు అసలు ఇక్కడ ఓటు హక్కే లేదని వీరు రాజకీయ పునరావాసం కోసం మల్కాజిగిరిలో పోటీ చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం గాజులరామారం సర్కిల్, సూరారం డివిజన్ పరిధి, షాపూర్నగర్లోని ఎం.జే గార్డెన్స్లో నిర్వహించిన ముస్లిం మైనార్టీ సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో షాదీముబారక్ పథకంలో ముస్లిం యువతుల వివాహాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు విదేశీ విద్య వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు పార్లమెంట్లో 12మంది ఉంటే మన హక్కులు, మనకు రావాల్సిన బడ్జెట్ను సాధించుకోలేమా..? అని ప్రశ్నించారు. జూన్ 2వ తేదీతో హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ముగింపు ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలను గెలిపించుకుంటే బీజేపీ ప్రభుత్వం చేసే కేంద్రపాలిత ప్రాంతం అనే కుట్రను తిప్పి కొట్టవచ్చని చెప్పారు. మే 13న జరిగే ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం పనిచేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అనే మాటనే మరిచిందని, ఇచ్చిన అరు హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ శేఖర్గౌడ్, నేతలు మహ్మద్ఫ్రీ, మక్సూద్ అలీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.