Telangana | సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : అధికార పార్టీ జోరుకు కాంగ్రెస్, బీజేపీలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు అందుకుంటున్నది. గ్రేటర్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు తీసుకున్న చర్యలు.. భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తున్నారు. వీరి ప్రచారం చూస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. అగ్రనాయకుల తీరుతో ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఓ మూలన కూర్చోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై ఆ క్యాడర్ అంతా అసహనం వ్యక్తం చేస్తుంది. ‘గిట్ల అయితే డిపాజిట్లు కూడా రావు.’ అని కాంగ్రెస్, బీజేపీ పార్టీ కార్యకర్తలు తమ నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకోవడం కంటే అధికార పార్టీ కండువా కప్పుకోవడం మేలని చాలా మంది కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలోకి గ్రేటర్లో ప్రతిపక్షాల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా టికెట్ ఆశించే ఆశవాహులు తమ పరిస్థితి క్యాడర్కు చెప్పకోలేక.. ఏం చేయాలో తెలియక రాత్రిల్లు కంటిమీద కునుకు ఉండటం లేదని ఆవేదన చెందుతున్నట్టు సమాచారం.
మొన్నటి వరకు టికెట్ తమకే వస్తుందని హడావిడి చేసిన నాయకులు ప్రస్తుతం మొఖం చాటేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల హైకమాండ్ ఢిల్లీతో ముడిపడి ఉండటంతో ఈ సమస్య వస్తుందని వారు చర్చించుకుంటున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లు ఆశిస్తున్న వారిలో చాలా మంది ప్రచారం విషయంలో ఆలోచనలో పడ్డారు. ఓ రోజు ఒకరికి.. మరో రోజు మరొకరికి వస్తుందని ప్రకటనలు వెలువడుతుండటంతో టికెట్ గ్యారంటీ లేదని ఆశావాహులు తెలిసిన వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ ధైర్యం చేసి టికెట్ తమకే అని నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెడితే.. అంత ఖర్చు పెట్టినా టికెట్ రాకుంటే ఎలా అంటూ వారంతా హైరానా పడుతున్నారు. ప్రచారం కాదు.. టికెట్ల కోసం హైకమాండ్ను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. టికెట్ ప్రకటన ఇలాగే ఆలస్యమైతే డిపాజిట్లు కూడా రావని ప్రతిపక్షాలు గుట్టుగా చర్చించుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనే ఇంకా ప్రారంభం కాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి.
అన్నా.. మన ప్రచారం ఎప్పుడే. ఇప్పటికే గులాబీ పార్టీ దూసుకుపోతున్నది. గల్లీ గల్లీ చుట్టేస్తుండ్రు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ ప్రజా క్షేత్రంలో ఉన్నారు. హ్యాట్రిక్ విజయం అందించడానికి ప్రజలు అదే స్థాయిలో వారందరికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతుండ్రు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాన ఎజెండాగా వారంతా గట్టిగానే తిరుగుతుండ్రు. గిట్లయితే మనం గెలవడం కష్టమే. ఆలస్యమైతే డిపాజిట్లు కూడా రావన్న. తొందరగా ప్రచారం మొదలుపెడుదామే. నువ్వే మా క్యాండెట్. ఢిల్లీవోళ్లు ఏమంటుండ్రు? ఏమంటవు అన్నా.
– ఇది టికెట్ తమ నాయకుడికే వస్తుందనే ఆశతో ఉన్న క్యాడర్ ఆవేదన
తమ్మీ నీ బాధ నాకు ఎరుకైతంది. కానీ నా బాధ గీడ ఎవ్వడు ఇంటలేడు. నేను 30 ఏండ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నా. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్న. ఎప్పుడు లేని దుస్థితి ఈసారి వచ్చి పడింది. రాత్రి నిద్దురకూడా సక్కగ పడతలే. టికెట్ వస్తదో.. రాదో.. కూడా తెలియని పరిస్థితి నాది. మనం అనుకుంటున్న నియోజకవర్గం నుంచి పోటీచేసేది నేనా.. కాదా..? అనే విషయం కూడా నాకు క్లారిటీ లేదు. మొన్నటి వరకు నా వెంట తిరిగినోళ్లే నాకన్న ఎక్కువగా హై కమాండ్ వద్ద లాబియింగ్ చేస్తుండ్రు. టికెట్ ఇవ్వాల్సిందేనని గట్టిగానే కూసుండ్రు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగమాగమవ్వడం ఎందుకు తమ్మీ.. చూద్దాం.. ఏం జరుగుతుందో… ప్రచారం మొదలుపెట్టాక టికెట్ రాకపోతే ఇజ్జత్ పోదా తమ్మీ..
– ఇది కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఓ ముఖ్య నేత పరిస్థితి